తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2019, 7:17 PM IST

Updated : Sep 7, 2019, 9:01 PM IST

ETV Bharat / state

వంతెన లేక ఒక కిమీ దూరం పది కిలోమీటర్లైంది..

రెండు వంతెనలు నిర్మిస్తే వందలాది మందికి ప్రయాణ కష్టాలు తీరతాయి. రైతులు, విద్యార్థులు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు దూరమవుతాయి. అయినా ఎవరూ పట్టించుకోరు. పనులు మంజూరవడం, టెండర్లు వేయడం, పనులు పూర్తికాకుండానే వదిలేసి వెళ్లడం... మళ్లీ టెండర్లు పిలవడం ఇదీ అక్కడి తంతు.

వంతెన లేక కి.మీ. పది కిలోమీటర్లైంది..

వంతెన లేక ఒక కిమీ దూరం పది కిలోమీటర్లైంది..

వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ మండలం జానంపేట గ్రామ శివారులో కానుగల వాగు ఉంది. జూరాల నుంచి భీమా ఎత్తిపోతల పథకానికి సాగు నీళ్లు విడుదల చేసినప్పుడు, వానలు బాగా కురిసినప్పుడు, పంట పొలాలు నిండినప్పుడు ఈ వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. వేసవిలో మినహా మిగిలిన అన్ని నెలల్లో వాగు ప్రవహిస్తూనే ఉంటుంది. జానంపేట మీదుగా హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారి రంగాపూర్ వద్దకు చేరుకునేందుకు ఇదే దగ్గరి దారి. జానంపేట చుట్టుపక్కల గ్రామాల రైతులందరూ ఈ దారి గుండానే పంట పొలాలకు వెళ్లాల్సి ఉంటుంది. వంతెన లేక కొందరు ధైర్యం చేసి ఆ వాగులోంచి ప్రయాణిస్తున్నారు. వర్షాలు పడినప్పుడైతే... పీకల్లోతు వరకు మునిగి అవతలి గట్టుకు చేరుకుంటారు.

కానుగల వాగుపై వంతెన నిర్మాణ పనులు 2007లోనే మంజూరయ్యాయి. 2009లో టెండర్లూ ఖరారయ్యాయి. పనులు కూడా ప్రారంభించారు. వంతెన వస్తుందని ఆశపడేలోపే పనులు నిలిపివేశారు. సుమారు కోటి 40 లక్షలతో చేపట్టిన ఈ పనులకు 70శాతం బిల్లులు చెల్లించినా... 50శాతం పనులు కూడా చేయలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గుత్తేదారు పనులు అలాగే వదిలిపెట్టినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. పాలకులు, ప్రభుత్వాలు మారినా వంతెన నిర్మాణం మాత్రం అలాగే ఉండిపోయింది.

శ్రీరంగాపూర్- శేరిపల్లి గ్రామాల మధ్య ఉన్న జింకలోనిపల్లి వాగు పరిస్థితి కూడా ఇంతే. మూడు కాలాల పాటు వాగు ప్రవహిస్తూనే ఉంటుంది. అందువల్ల చుట్టు పక్కల గ్రామస్థులందరూ 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. శేరిపల్లి నుంచి శ్రీరంగాపురానికి సుమారు 200 మంది పాఠశాల, కళాశాల విద్యార్థులు, రైతులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వాహనాలు ఉన్నవాళ్లు చుట్టూ తిరిగి వస్తే రైతులు మాత్రం కాలినడకనే ప్రయాణం సాగిస్తారు. శేరిపల్లి వంతెనకు కూడా ఇప్పటికి రెండు మూడు సార్లు టెండర్లు పిలిచారు. ఇద్దరు గుత్తేదారులు మారినా... పనులు మాత్రం పూర్తి చేయలేదు. వాగు వద్ద పిల్లర్ల కోసం గుంతలు తవ్వి వదిలివేయడం వల్ల వాగు మరింత ప్రమాదకరంగా మారింది.
ఈ రెండు వంతెనలు పూర్తి చేస్తే... ఎంతో మంది ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. దూరభారం తగ్గడమే కాకుండా ప్రయాణం మరింత సులువు కానుంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: ఇస్మార్ట్​ దొంగలు​.. నిమిషాల్లో దోచారు రెండు లక్షలు​!

Last Updated : Sep 7, 2019, 9:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details