తెలంగాణ

telangana

ETV Bharat / state

పాలమూరులో యథేచ్ఛగా మట్టి దందా

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో అక్రమ మట్టి తవ్వకాల దందా యథేచ్ఛగా సాగుతోంది. అధికారుల అనుమతులు లేకుండానే శిఖం భూములు, గుట్టల మట్టిని తవ్వి వెంచర్లు, గృహనిర్మాణాల కోసం అమ్ముకుంటున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ముఖ్యనేతల అండదండలతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అన్నీ తెలిసినా.. అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

By

Published : Nov 13, 2019, 7:27 PM IST

మట్టి దందా

యథేచ్ఛగా మట్టి దందా

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. గుట్టలను తవ్వి కోట్లను గడిస్తూ... యథేచ్ఛగా పర్యావరణానికి హానీ కలిగిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతూ.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మహబూబ్​నగర్​ జిల్లా పట్టణ పరిధిలోని అప్పనపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న పెద్ద చెరువు, చెరువుకు ఆనుకుని ఉన్న గుట్టను అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వి అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల మేరకు చెరువు శిఖం భూముల్లో మట్టి తవ్వకాలు నీటిపారుదల, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా జరపకూడదు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే శిఖం భూముల్లో మట్టిని తవ్వేస్తున్నారు.

రోజూ రూ. 15 లక్షలు...

అప్పనపల్లి శివారుకు వెళ్తే కొన్నేళ్లుగా చెరువు, గుట్టల నుంచి ఎంత మట్టిని తవ్వారో ఆనవాళ్లు, గుర్తులు స్పష్టంగా కనిపిస్తాయి. ఐదారు జేసీబీలతో 20కి పైగా టిప్పర్లతో అక్కడి నుంచి మట్టిని తరలిస్తున్నారు. నిత్యం ఎన్ని భారీ వాహనాలు తిరుగుతాయో.. ఆ రోడ్లను చూస్తేనే స్పష్టమవుతోంది. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. అక్రమంగా తవ్విన మట్టిని అప్పనపల్లి నుంచి ఎదిర వరకూ ఇటీవల వెలిసిన వెంచర్లకు, గృహ నిర్మాణాల కోసం తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్​కు దూరాన్ని బట్టి రూ. 3,500 నుంచి రూ.8,000 వరకూ వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మట్టి అమ్మకాల ద్వారా రోజూ సుమారు రూ.15లక్షల వ్యాపారం సాగుతోందని సమాచారం.

జోక్యం చేసుకోవద్దంటూ.. బెదిరింపులు

మట్టి అక్రమ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి ఈటీవీ భారత్​ ప్రతినిధుల బృందం వెళ్లగా సమాచారం అందుకున్న అక్రమార్కులు.. వాహనాలను అక్కడి నుంచి మారుమూల ప్రాంతాలకు తరలించారు. టిప్పర్లను గ్రామ శివారులోనే నిలిపివేశారు. తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని చిత్రీకరిస్తుండగా అడ్డుకున్నారు. ఈ దృశ్యాలు తీయవద్దంటూ వారించారు. మట్టి తరలింపు తమ ఊరి వ్యవహారమని.. జోక్యం చేసుకోవద్దని... అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బెదిరించారు. సమాచారం ఇచ్చింది ఎవరో చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే కొందరికి మామూళ్లు ముట్టజెప్పామన్నారు.

నేతల అండదండలతోనే...

అధికారులు మాత్రం అప్పనపల్లి గ్రామంలో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ముఖ్యనేతల అండదండలు ఉన్న కారణంగానే అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఇదీ చూడండి : ఈటీవీ భారత్ ఎఫెక్ట్: కేన్సర్ బాధితురాలికి అండగా బాలకృష్ణ

ABOUT THE AUTHOR

...view details