తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉచిత చేపపిల్లల పంపిణీలో అవకతవకలు! - Manipulations in the distribution of free fish news

మత్స్యకారుల ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం... క్షేత్రస్థాయిలో అవకతవకలకు లోనవుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేపపిల్లలు తక్కువ సైజున్నా, లెక్కతప్పినా తిరస్కరించాలని ప్రభుత్వం సూచిస్తున్నా... తిరస్కరిస్తే మళ్లీ ఇస్తారో లేదో అని భయపడి మత్సకారులకు నోరు మెదపడం లేదు. ఇక జలాశయాలు, పెద్ద చెరువుల్లో వదిలే చేపపిల్లల పంపిణీలో లెక్కతప్పుతోందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

ఉచిత చేపపిల్లల పంపిణీలో అవకతవకలు!
ఉచిత చేపపిల్లల పంపిణీలో అవకతవకలు!

By

Published : Sep 16, 2020, 5:30 AM IST

Updated : Sep 16, 2020, 8:09 AM IST

ఉచిత చేపపిల్లల పంపిణీలో అవకతవకలు!

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం కోట్లు వెచ్చించి 100 శాతం రాయితీపై ప్రభుత్వం చేపపిల్లల్ని అందిస్తోంది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మత్స్యకార సంఘాలదేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పలుమార్లు స్పష్టం చేశారు. చేపల సైజు, సంఖ్యల్లో తేడాలుంటే నిర్దాక్షిణ్యంగా తిరస్కరించాలని ఎన్నోసార్లు సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలాశయాలు, చెరువులు, కుంటలన్నీ కలిపి 5 వేల వరకున్నాయి. వాటి విస్తీర్ణాన్ని బట్టి 12 కోట్ల చేప పిల్లలు అవసరమవుతాయి. ఆగస్టు 6 నుంచి ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల 72 లక్షల చేపపిల్లల్ని పంపిణీ చేశారు. అయితే ఇదంతా సక్రమంగా జరగలేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఫిర్యాదు చేసినా..

మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం అమిస్తాపూర్‌ చెరువులు, కుంటల్లో 75 వేల చేప పిల్లల్ని పిల్లలమర్రి కేంద్రం నుంచి తీసుకువచ్చి వదిలారు. చెరువులో విడిచిన గంటా, రెండు గంటల్లోనే 70శాతం వరకు చేపలు చనిపోయాయి. అధికారులకు, జిల్లా సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మత్సకారులు ఆరోపించారు.

రెండు సైజుల్లో చేప పిల్లల పంపిణీ..

మత్స్యకారులకు ప్రభుత్వం రెండు సైజుల్లో చేపపిల్లల్ని పంపిణీ చేస్తోంది. 35 మిల్లీమీటర్ల నుంచి 40 మిల్లీమీటర్ల పరిమాణాల్లో ఉండే చేపలను చెరువులు, కుంటల్లో వదులుతారు. వీటిని జిల్లాల్లోని నిల్వ కేంద్రాలకు తీసుకొచ్చి అక్కడ్నుంచి సంఘాలకు అందిస్తారు. అప్పగించే ముందే సరైన సైజు ఉన్నాయా?, లెక్క సరిగ్గా ఉందా? అన్నది చూపించి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల తక్కువ సైజున్న పిల్లల్నే మత్స్యకారులకు అంటగడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏడాది పొడవునా..

80 నుంచి 100 మిల్లీమీటర్ల పరిమాణాల్లో ఉండే పెద్ద చేపల్ని ఏడాది పొడవునా నీళ్లుండే చెరువులు, జలాశయాల్లో వదులుతారు. వీటిని వాహనాల్లో తీసుకువచ్చి నేరుగా అందిస్తారు. కిలోకు ఎన్ని చేపపిల్లలు వస్తాయో తూకం చేసి కావాల్సిన సంఖ్యలో జలాశయాల్లో వదులుతారు. 50 వేల చేపపిల్లలను వదిలి... లెక్కల్లో లక్ష చూపుతున్నారన్న ఆరోపణలున్నాయి.

తుంగలో నిబంధనలు..

పంపిణీదారులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలు తుంగలో తొక్కుతున్నారన్న విమర్శలున్నాయి. అధికారులు మాత్రం మత్స్యకారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవని చెబుతున్నారు. చెరువుల్లో నీటి లభ్యత, నాణ్యతను బట్టి చేపలు బరువు పెరుగుతాయంటున్నారు. సైజు, తూకంలో మోసం లేదని.. ఉంటే తిరస్కరించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు 40 శాతానికి మించి చేప పిల్లల పంపిణీ జరగలేదు. మిగిలిన చెరువుల్లోనైనా నాణ్యమైన చేపల్ని పంపిణీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: శ్రీశైల జలాశయం ఏడు గేట్లను ఎత్తిన అధికారులు

Last Updated : Sep 16, 2020, 8:09 AM IST

ABOUT THE AUTHOR

...view details