కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా చమురు, గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై ఆర్థిక భారం మోపుతోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్కం ఠాగూర్(Manickam Tagore) ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, భూముల పేరుతో సామాన్యులను దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వారం రోజులపాటు జన్ జాగరణ్(jan jagaran) చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ నియోజకవర్గ మండల అధ్యక్ష సమావేశానికి మాణిక్కం ఠాగూర్ హాజరయ్యారు.
నవంబరు 14 నుంచి 21 వరకు వారం పాటు.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు(jan jagaran) చేపట్టనున్నట్లు మాణిక్కం(Manickam Tagore) తెలిపారు. 33 జిల్లాల వారీగా కార్యకర్తల నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు పాదయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. 2వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. నారాయణపేట జిల్లా నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని.. మొదటి రోజు పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉందని మాణిక్కం(Manickam Tagore) తెలిపారు.