Land Mafia: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా రెచ్చిపోతోంది.. అమాయకుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ ప్రభుత్వ స్థలాల్లో నకిలీ పట్టాలు సృష్టిస్తూ అంటగడుతోంది.. ప్రజాప్రతినిధులు, కొందరు రెవెన్యూ అధికారుల మద్దతు ఉండడంతో వీరి ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది.. మహబూబ్నగర్ శివారులోని క్రిస్టియన్పల్లి ఆదర్శనగర్లో ఉన్న 523 ప్రభుత్వ సర్వే నంబరులో ఏకంగా మంగళవారం అర్ధరాత్రి తరవాత 70కి పైగా గుడిసెలు వెలిశాయి. దళారులు దగ్గరుండి మరీ ఆ గుడిసెలను వేయించారు.
దొంగ పట్టాల సృష్టి...
గతంలో వారి వద్ద రూ.70 వేల నుంచి రూ.3.50 లక్షల వసూలు చేసిన దళారులు రెవెన్యూ అధికారులు పరిశీలనకు వస్తున్నారని హడావుడిగా గుడిసెలు వేయించారు. ఈ వ్యవహారంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు, వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండలానికి చెందిన ఓ మాజీ స్థానిక ప్రజాప్రతినిధి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దొంగ పట్టాలు సృష్టించడం, పురపాలికలో ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకోవడం, పన్ను చెల్లించడం దగ్గర నుంచి అన్నీ వీరే చూసుకుంటున్నారు. సుమారు రూ.5 కోట్లకుపైగానే చేతులు మారినట్లు తెలుస్తోంది.
మహబూబ్నగర్ జిల్లా కన్మనూరు గ్రామానికి చెందిన మహిళకు ఓ దళారి ప్రభుత్వ జాగా ఇప్పిస్తానని ఏడాదిన్నర కిందట రూ.3.50 లక్షలను తీసుకున్నాడు. మహబూబ్నగర్ శివారులోని ప్రభుత్వ స్థలం 523 సర్వే నంబరులో స్థలాన్ని చూపించి నకిలీ పట్టాను ఇచ్చాడు. మంగళవారం అర్ధరాత్రి హడావుడిగా ఆమెతో ఆ స్థలంలో ఓ కవర్తో చిన్న గుడిసెలాగా ఏర్పాటు చేయించడంతోపాటు ఇంటికి పన్ను చెల్లిస్తున్నట్లు మహబూబ్నగర్ పురపాలిక ధ్రువపత్రం కూడా ఇచ్చాడు. అక్కడ ఇల్లే లేకున్నా పురపాలిక ఇంటి నంబరు 14-3-AD0007/A/1 ను కేటాయించడంతోపాటు ఆ ధ్రువపత్రంలో గత ఏడాది మే 10న రూ.280 ఇంటి పన్ను చెల్లించినట్లు ఉంది.
గతంలో అనర్హులకు పట్టాలు..
532/1 సర్వే నంబరులో 83.28 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉండగా సుమారు 2,400 మందికి పట్టాలు ఇచ్చినట్లు రికార్డుల్లో ఉండటంతో 2017లో అధికారులు విచారణ చేశారు. 586 పట్టాలు సక్రమమని గుర్తించి వారికి రెండు పడక గదుల ఇళ్లను అదే ప్రాంతంలో నిర్మించి ఇచ్చారు. 75 మంది దివ్యాంగులకు పట్టాలను ఇచ్చారు. మిగతా స్థలాన్ని భూ మాఫియా దొంగ పట్టాలతో విక్రయిస్తోంది. అయిదేళ్లుగా ఈ సర్వే నంబర్లలో ఎవరికీ పట్టాలు ఇవ్వకున్నా ఏడాది కిందట తమకు పట్టాలు వచ్చాయని గుడిసెలు వేసుకున్నవారు వెల్లడిస్తుండటం గమనార్హం.