ఖరీఫ్లో పండిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. ఈ సారి ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇబ్బందులు తప్పేలా లేవు. యాసంగిలో కొనుగోలు చేసిన ధాన్యమే ఇప్పటికీ రైస్ మిల్లుల్లో లక్షల మెట్రిక్ టన్నుల్లో పేరుకుపోయి ఉంది. ఆ నిల్వల్ని మరాడించి కస్టమ్ మిల్లింగ్ కింద మిల్లర్లు ఎఫ్సీఐ(FCI) కి అప్పగించాల్సి ఉండగా... ఇప్పటికీ 30శాతం కూడా ఇవ్వలేకపోయారు. గత సీజన్లో అన్ని జిల్లాల్లో మిల్లింగ్ సామర్థ్యానికి రెట్టింపు ధాన్యం అప్పగించారు. మిల్లు సామర్థ్యం ఎంతో అంతే ఇస్తే నవంబర్ నాటికి కస్టమ్ మిల్లింగ్ పూర్తయ్యేది. సామర్థ్యానికి మించి రావడంతో 70శాతం ధాన్యం ఇంకా మిగిలిపోయి ఉంది. దీనికితోడు సీఎంఆర్(CMR) బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్సీఐ(FCI) గోదాముల్లో నింపి, అక్కన్నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే సమస్య ఉండేది కాదు. కానీ మిల్లర్ల నుంచి బియ్యం తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఫలితంగా మిల్లుల్లో ధాన్యం ఖాళీ కావడం లేదు.
ఎక్కడ నిల్వ చేస్తారో..
యాసంగిలో మిల్లుల సామర్థ్యం సరిపోక పాఠశాలలు, కళాశాలలు, ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికల్లో ధాన్యం నిల్వచేశారు. మహబూబ్నగర్ జిల్లాలోని చాలా రైతు వేదికల్లో ఇప్పటికీ ధాన్యం అలాగే నిల్వ ఉంది. సీఎంఆర్ బియ్యాన్ని ఎఫ్సీఐ(FCI) ఎప్పటికప్పుడు సేకరిస్తే ఈ సమస్య ఉండేది కాదని మిల్లర్లు చెబుతున్నారు. గోదాముల సామర్థ్యం పెంచుకోవాలని సూచించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉన్న ధాన్యామే ఖాళీకాక ఇబ్బందులు పడుతుంటే వానాకాలంలో సేకరించే ధాన్యాన్ని ఎక్కడ నిల్వచేయాలని ప్రశ్నిస్తున్నారు.