తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 2:17 PM IST

ETV Bharat / state

నిధులు విడుదల కాలే.. విశ్వవిద్యాలయంలో సమస్యలు తీరలే

విశ్వవిద్యాయాలు ప్రారంభించారే తప్ప.. వాటి నిర్వాహణ అభివృద్ధిపై పాలకులు దృష్టి సారించడం లేదు. ఏటా ప్రకటించే బడ్జెట్​లో విశ్వవిద్యాయాలకు కేటాయించే నిధులు జీత భత్యాలకు తప్ప, మౌలిక వనతుల కల్పన, అభివృద్ధికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ఫలితం నాణ్యమైన విద్య విద్యార్థులకు అందకపోగా, ఉన్నత విద్యా ప్రమాణాలు, పరిశోధన, కొత్త కోర్సుల్లాంటి అంశాల్లో పాలమూరు లాంటి విశ్వవిద్యాలయాలు వెనకబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల కేటాయింపు లేకపోవడంతో తక్షణం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు ఆగిపోయాయి. నిధుల లేమి కారణంగా పాలమూరు విశ్వవిద్యాలయం ఎదుర్కొంటున్న సమస్యలపై కథనం.

funds-are-not-released-for-palamuru-university
నిధులు విడుదల కాలే.. విశ్వవిద్యాలయంలో సమస్యలు తీరలే

వెనకబడిన ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఉన్నత విద్య అందించి, విద్యా ప్రమాణాలను మరింత మెరుగు పరిచే ఉద్దేశంతో.. 2008లో పాలమూరు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ విశ్వవిద్యాలయం అభివృద్ధిపై పాలకులు పెద్దగా దృష్టి సారించడం లేదు. ఏటా ప్రకటించే రాష్ట్ర బడ్జెట్​లో పాలమూరు విశ్వవిద్యాలయానికి నిరాశే ఎదురవుతోంది. ఈసారి కూడా అదే జరిగింది. రూ.137.54 కోట్ల ప్రతిపాదనలు పంపితే కేవలం.. రూ.7.53 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులు విశ్వవిద్యాలయంలో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది వేతనాలకు తప్ప, తక్షణం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఏ మాత్రం సరిపోవు.

గత బడ్జెట్​లో కేటాయింపులు, విడుదలైన నిధుల్ని గమనించినా.. ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2010-11లో రూ.10 కోట్లు, 2013-14లో రూ.8.9 కోట్లు, 2017-18లో రూ.40 కోట్లు కేటాయించి కేవలం రూ.12 కోట్లు మంజూరు చేశారు. 2018-19లో రూ.20 కోట్లు కేటాయించినా పైసా కూడా విడుదల కాలేదు. 2019-20లో రూ.18 కోట్లు కేటాయించి ఇచ్చింది కేవలం రూ.90 లక్షలే. 2020-21లో రూ.7.36 కోట్లకు గాను రూ.4.29 కోట్లు మాత్రమే విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకపోవడంతో తక్షణం చేపట్టాల్సిన పనులు ఆగిపోతున్నాయి.

భర్తీ అయింది కేవలం 25

విశ్వవిద్యాలయంలో 300 మంది బాలికల కోసం వసతి గృహం, సెంట్రల్ ఇన్ట్రూమంటేషన్ సెంటర్, హెల్త్ సెంటర్, మంచినీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు, పరిశోధన కేంద్రం, మిని స్టేడియం, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ భవనం, ఆడిటోరియం, రిజిస్ట్రార్ నివాస గృహం, స్టాఫ్ క్వాటర్ల కోసం రూ.94 కోట్ల ప్రతిపాదనలు పంపితే కేటాయించిన నిధుల్లో వాటి ఊసేలేదు. బాలుర, బాలికల వసతి గృహాల్లో కనీస వసతుల కల్పన, కార్యాలయ సామగ్రి, వాటర్ ప్లాంట్లు, ప్రయోగశాలల పరికరాలు, గ్రంథాలయానికి పుస్తకాలు, సౌర విద్యుత్ ప్లాంట్ లాంటి వాటి కోసం మరో తొమ్మిదిన్నర కోట్లు కావాలని నివేదిస్తే పైసా విదిలించింది లేదు. ఇలాగైతే విశ్వవిద్యాలయ నిర్వాహణ ఇబ్బందుల్లో పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక పాలమూరు విశ్వవిద్యాలయానికి 95 పోస్టులు మంజూరు చేస్తే.. ఇప్పటి వరకూ భర్తీ అయింది కేవలం 25 మంది మాత్రమే. అకడమిక్ కన్సల్టెంట్​లు, తాత్కాలిక ఉద్యోగులతో ప్రస్తుతానికి నెట్టుకొస్తున్నారు.

న్యాక్ బీ గ్రేడ్ గుర్తింపు?

రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వక పోయినా విశ్వవిద్యాలయానికి న్యాక్ బీ గ్రేడ్ గుర్తింపు రావడం ద్వారా రూసా నిధులు సుమారు రూ.20 కోట్లు మంజూరయ్యాయి. రెండేళ్లలో 10 కోట్ల నిధులతో అప్పటి వరకూ పెండింగ్​లో ఉన్న పనులను పూర్తి చేసుకున్నారు. విశ్వవిద్యాలయం చుట్టూ ప్రహరీ, నర్సరీలు, లక్షకుపైగా చెట్లతో ఉద్యానవనాలు, పరీక్షా విభాగం, కొల్లాపూర్, వనపర్తి, గద్వాలలో పీజీ సెంటర్, బాల, బాలికల వసతి గృహాలు పూర్తి చేశారు. మరో రూ.10 కోట్లతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు. రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేయడం పాలమూరు విశ్వవిద్యాలయం స్వతహాగా సాధించిన విజయంగా చెప్పవచ్చు. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం సహా వివిధ విద్యా, పరిశోధన సంస్థల నుంచి కొత్త ప్రాజెక్టులు తీసుకువచ్చి వాటి ద్వారా వచ్చే నిధులతో విశ్వవిద్యాలయ అభివృద్ధికి బాటలు వేయాలని వివిధ డిపార్ట్​మెంట్లు ఆలోచిస్తున్నాయి.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాలమూరు విశ్వవిద్యాలయంలో పరిశోధన, కొత్త కోర్సుల ప్రవేశం, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తే.. భవిష్యత్తులో వివిధ సంస్థల ద్వారా విశ్వవిద్యాయానికి మరిన్ని నిధులు తెచ్చుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదీ చూడండి:'మిమ్మల్నందర్నీ వీడలేక వీడ్కోలు పలుకుతున్నా'

ABOUT THE AUTHOR

...view details