తెలంగాణ

telangana

రైతన్నలకు సన్నరకం ధాన్యం కొనుగోళ్ల కష్టాలు

By

Published : Nov 14, 2020, 9:39 AM IST

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సన్నరకం ధాన్యం నాణ్యతపై మిల్లర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ నిబంధనల మేరకు ధాన్యాన్ని మరాడించి 67 శాతం బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలి. సన్నరకం విషయంలో అది సాధ్యం కాదనే అభిప్రాయం మిల్లర్ల నుంచి వ్యక్తమవుతోంది. ఇప్పటికీ ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉండగా జిల్లాల్లో మాత్రం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా.. మిల్లర్లతో ఒప్పందాలు మాత్రం జరగలేదు. దీంతో కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. రబీలో సీఎంఆర్ లక్ష్యం పూర్తికాకపోగా.. ఆ ధాన్యం సైతం మిల్లుల్లోనూ మూలుగుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాక పెద్ద ఎత్తున మొదలైతే ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియలో ఇబ్బందులు తప్పేలా లేవు.

రైతన్నలకు సన్నరకం ధాన్యం కొనుగోళ్ల కష్టాలు
రైతన్నలకు సన్నరకం ధాన్యం కొనుగోళ్ల కష్టాలు

రైతన్నలకు సన్నరకం ధాన్యం కొనుగోళ్ల కష్టాలు

ఉమ్మడి మహబూబ్​నగర్ జిల్లాలో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్నరకం ధాన్యాన్ని మరాడించే అంశంపై మిల్లర్లకు, అధికార యంత్రాగానికి మధ్య ఒప్పందాలు కుదరకపోవడం వల్ల వరి ధాన్యం కేంద్రాల వద్ద కొనుగోళ్లు సాగడం లేదు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరాడించి ఇవ్వడానికి మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ మధ్య ఒప్పందాలు జరగాలి. కస్టమ్ మిల్లింగ్​లో భాగంగా 100 కిలోల ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగిస్తే.. 67 కిలోల బియ్యాన్ని మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో కురిసిన అధిక వర్షాల కారణంగా వరి చాలాచోట్ల దెబ్బతింది. దోమకాటు, మానిపండు తెగులు, కాండం తొలచు పురుగు లాంటి తెగుళ్లు సోకాయి. ఈ కారణంగా ధాన్యం నాణ్యత కోల్పోయిందని మిల్లర్లు ఆరోపిస్తున్నారు. 67 శాతం బియ్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని అంటున్నారు.

కేంద్రం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని ఆరబెట్టుకుని తీసుకురావాల్సిందిగా ఇప్పటికే వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. నిబంధనల ప్రకారం క్వింటాకు 3 శాతం రంగు మారిన ధాన్యం, ఒక శాతం తాలు, ఒక శాతం రాళ్లు, మట్టి పెళ్లలు, ఒక శాతం గింజ పూర్తికాని ధాన్యం ఉన్నా దాన్ని కొనుగోలు చేయవచ్చు. మిల్లర్లు మాత్రం సరైన నాణ్యత ఉంటేనే మిల్లుల్లో దించుకుంటామంటున్నారు. రబీ సీజన్​లోనూ నాణ్యత లేదన్న కారణంగా చాలాచోట్ల మిల్లర్లు సరకు దింపుకోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.

అధికారులు మాత్రం ధాన్యం కొనుగోళ్లకు సర్వం సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. నాణ్యత ప్రమాణాలకు లోబడే ధాన్యాన్ని సేకరిస్తున్నామని రవాణా, కస్టమ్ మిల్లింగ్ ఒప్పందాల్లోనూ ఎలాంటి ఇబ్బందులు లేవని ధాన్యం రాక మొదలైతే కొనుగోళ్లు ఊపందుకుంటాయని అంటున్నారు. రబీ సీజన్​లో కొనుగోలు చేసి ప్రభుత్వం మిల్లర్లకు మరాడించేందుకు అప్పగించిన సీఎంఆర్​ లక్ష్యం కూడా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆ ధాన్యం ఇంకా మిల్లర్ల వద్దే ఉంది. ఈ నేపథ్యంలో ధాన్యం మిల్లులకు తరలించే విషయంలో ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదీ చదవండి:కొనుగోలు కేంద్రాల వద్ద రైతన్నల పడిగాపులు.. టోకెన్ల కోసం ధర్నా

ABOUT THE AUTHOR

...view details