మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. కరోనా వార్డు, కొవిడ్ పరీక్షలు నిర్వహించే విభాగాన్ని, ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరికైనా జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స పొందితే ఎలాంటి ప్రాణాపాయం ఉండదన్నారు.
మరో 250 పడకలు
కొవిడ్ నుంచి కోలుకున్న రోగులతో మంత్రి మాట్లాడారు. చికిత్స ఇతర వసతులు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మంచి సేవలందిస్తున్నారని భోజనం బాగా ఉందని కరోనా నుంచి కోలుకున్న రోగులు మంత్రికి తెలిపారు. జిల్లాలో గత సంవత్సరమే సుమారు 300 పడకలతో కొవిడ్ వార్డు ఏర్పాటు చేశామని, వారం రోజుల్లో మరో 250 పడకలను పూర్తి ఆక్సిజన్తో సహా ఏర్పాటు చేయనున్నామని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.