Drone technology bootcamp in IIIT kurnool : ఒకప్పుడు కొందరు సంపన్నుల చేతిలోనే కనిపించిన మొబైల్ ఫోన్.. ప్రస్తుతం సామాన్యుడి వరకూ ఎలా విస్తరించిందో.. రానున్న రోజుల్లో డ్రోన్ల వినియోగం అలాగే ఉంటుందని అనడంలో సందేహం లేదు. అందుకే కేంద్రప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ట్రిపుల్ ఐటీ కర్నూల్ ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ క్యాంప్లో ఆసక్తిగల విద్యార్థులు పాల్గొని భవిష్యత్ అవకాశాలకు మార్గంపై ఎంతో అవగాహన పెంచుకున్నారు.
దేశవ్యాప్తంగా శిక్షణ.. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపెంచాలని కేంద్రం సంకల్పించింది. 2026 నాటికి ఈ రంగం 15వేల కోట్ల పరిశ్రమగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది. అందుకే డ్రోన్లపై దేశవ్యాప్తంగా అవగాహన, నైపుణ్య శిక్షణ, పరిశోధన, అప్లికేషన్, స్టార్టప్లను ప్రోత్సహించాలని భావిస్తోంది ప్రభుత్వం. అయిదేళ్లలో 70వేల మందికి ఈ రంగంలో నైపుణ్యశిక్షణ అందించేందుకు ఐఐటీ, ఎన్ఐటీ లాంటి 30 సంస్థల్నిఎంపిక చేసింది.
దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఐటీ, ఎన్ఐటీ కళాశాల్లో బూట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలా ఎంపికైన కళాశాల్లో కర్నూల్ ట్రిపుల్ ఐటీ కూడా ఒకటి. ఈ కళాశాల ఆధ్వర్యంలో మెుదటి డ్రోన్ నైపుణ్య శిక్షణ ఇటీవల ప్రారంభించారు. తెలంగాణ మహబూబ్నగర్ జిల్లాలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆసక్తిగల 118 మంది విద్యార్థిని, విద్యార్ధులు 5 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు.
డ్రోన్స్ వినియోగంలో తర్ఫీదు.. అయిదు రోజుల పాటు బూట్ క్యాంప్లో డ్రోన్స్పై అవగాహన కార్యక్రమం జరిగింది. విడిభాగాలు వాటి తయారీ, డ్రోన్స్ అమర్చడం, ఎగురవేయడం, తిరిగి భాగాలుగా విడదీయడం.. వివిధ రంగాల్లో డ్రోన్స్ ఎలా వినియోగిస్తున్నారు. భవిష్యత్లులో మరిన్ని రంగాల్లో వాటిని ఎలా వినియోగించవచ్చన్న అంశాల్ని.. ట్రిపుల్ ఐటీ ప్రొఫెసర్లు విద్యార్ధులకు వివరించారు.