Devarakadra Railway Gate Closed : 167వ నెంబర్ జాతీయ రహదారిపై మహబూబ్నగర్ నుంచి రాయచూరు వెళ్లే మార్గంలో.. రైల్వేగేటును శాశ్వతంగా మూసివేశారు. దేవరకద్రలో రూ.24 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్బ్రిడ్జిని ఈనెల 8న మంత్రి ప్రశాంత్రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడున్న రైల్వేగేటును ఈనెల 17 నుంచి శాశ్వంతగా మూసివేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. 18 నుంచి అక్కడి గుండా రాకపోకలు ఆగిపోయాయి. గేటుకు సమీపంలో ఉన్న బస్టాండ్కు బస్సులు రావడం లేదు.
దేవరకద్రలో దిగాల్సిన ప్రయాణికులను ఆర్వోబీకి ఇరువైపులా దించేసి.. బస్సులు నేరుగా వెళ్లిపోతున్నాయి. హైదరాబాద్, రాయచూరు, నారాయణపేట, ఆత్మకూరు సహా వివిధ కేంద్రాలకు వెళ్లే బస్సులు 300లకు పైగా బస్టాండ్కు వచ్చి వెళ్తుంటాయి. ప్రస్తుతం వాటిలో పల్లెలకు వెళ్లే కొన్ని బస్సులు మినహా చాలా బస్సులు రావడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. దేవరకద్ర పట్టణం నియోజవర్గ కేంద్రం కావడంతో నిత్యం ఇక్కడకు వేలాది మంది వచ్చి వెళ్తుంటారు.
రైల్వేగేటును యథాతథంగా నిర్వహించాలి : బుధవారం జరిగే పశువుల సంత రాష్ట్రంలోనే పేరెన్నికగన్నది. రైల్వేగేటు సమీపంలోని దుకాణాల్లో నిత్యం కోట్ల రూపాయల వ్యాపారం సాగుతుంది. గేటు మూతతో ప్రస్తుతం ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైల్వేగేటుకు ఒకవైపు ప్రభుత్వాసుపత్రి, పోలీస్ స్టేషన్, మండల కార్యాలయాలున్నాయి. మరోవైపు బస్టాండ్ సహా ఇతర వ్యాపారాలున్నాయి. దేవకరద్రకు వచ్చే జనం తమ అవసరాల కోసం ఒకవైపు నుంచి మరోవైపు వెళ్లాలంటే చుట్టూ తిరిగి ఆర్వోబీపై నుంచి వెళ్లాల్సి వస్తోంది. అందుకే ఆర్వోబీ ఉన్నా రైల్వేగేటును యథాతథంగా నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.