ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. సోమవారం ఒక్క రోజు 254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో 103 కేసులు నమోదవడంతో జిల్లాలో కలవరం మొదలైంది. మహబూబ్నగర్ జిల్లాలో 63, నాగర్కర్నూల్ జిల్లాలో 51, వనపర్తి జిల్లాలో 29 మంది, నారాయణపేట జిల్లాలో ఏడు మంది కరోనా బారిన పడ్డారు.
జోగులాంబ గద్వాలలో శతకం...
జోగులాంబ గద్వాల జిల్లాలో ఒకే రోజు 103 కేసులు నమోదవడంతో జిల్లాలో కలవరం మొదలైంది. గద్వాల జిల్లాలో 13, అలంపూర్ నియోజకవర్గ పరిధిలో 39 నమోదవగా.. జిల్లాలో మరో 26 మంది, అయిజలో 15, ధరూరు మండలం ఉప్పేరులో 7 మంది, వడ్డేపల్లి, గట్టు, మార్లబీడు, మల్దకల్, తూర్పు గార్లపాడులొ ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ వచ్చింది.
మహబూబ్నగర్ జిల్లాలో 63 కేసులు నమోదు కాగా.. 43 పాజిటివ్ కేసులు జిల్లా కేంద్రానికి చెందినవే. అత్యధికంగా ఏనుగొండలో 8 మంది, నల్బౌలిలో నలుగురితో పాటు ఇతర వార్డులలో కేసులు నమోదయ్యాయి. జడ్చర్లలో 9, అడ్డాకులలో 3, దేవరకద్రలో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. సీసీకుంట మండలం అప్పంపల్లి, గండీడ్ మండలం దేశాయిపల్లి, నవాబుపేట మండలం లోకిరేవు, రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి, మూసాపేట మండలం నిజాలాపూర్, భూత్పూరులో ఒక్కొక్కరికి కరోనా సోకింది.