ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్... అన్నిరంగాలను దెబ్బతీయడమే కాదు ఎంతోమంది ఆదాయానికి గండికొట్టింది. ఆ జాబితాలో గురుకుల పాఠశాలల్లోని వంట సిబ్బందీ చేరారు. రాష్ట్రవ్యాప్తంగా 204 మైనార్టీ గురుకులాలుండగా... ఉదయం అల్పహారం నుంచి రాత్రి భోజనం వరకు వండి, వడ్డిస్తారు. మార్చి వరకూ అంతా సవ్యంగానే సాగినా... కొవిడ్తో గురుకులాలు మూతపడటం వల్ల విద్యార్థుల్లేక వంట సిబ్బందికి అవస్థలు తప్పడం లేదు.
నిరాశే ఎదురు...
విద్యాసంస్థలు తెరిస్తే పనిదొరుకుతుందని భావించిన వారికి నిరాశే ఎదురైంది. వసతిగృహాలు తెరవకపోవడం వల్ల వంట సిబ్బందిపై ఆధారపడిన కుటుంబాలు... కనీస అవసరాలకు నోచుకోక ఆకలితో అలమటిస్తున్నాయి. వైరస్ తీవ్రత వల్ల వేరే రంగాల్లోనూ పని దొరకడమే గగనమైందని వాపోతున్నారు. గురుకులాల్లోని మిగతా ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి పని కల్పిస్తూ జీతం చెల్లిస్తున్నారని, తమనూ అదే రీతిలో ఆదుకోవాలని వేడుకుంటున్నారు.