తెలంగాణ

telangana

ETV Bharat / state

Congress Jung Siren: పాలమూరు గడ్డ నుంచి జంగ్​ సైరన్ ఊదిన కాంగ్రెస్ - Revanth reddy latest updtaes

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్ (Congress Jung Siren) నిర్వహించింది. నీళ్లు-నిధులు-నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అన్నింటిని విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Pcc Chief Revanth Reddy) మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేవరకు, ఫీజు రీఎంబర్స్​మెంట్ విడుదలయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని పాలమూరు వేదికగా స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేసి ఉంటే... ఇప్పుడు ఏపీ సర్కార్ వాటిని అక్రమ ప్రాజెక్టులు అనేదా? అని రేవంత్ ప్రశ్నించారు.

Congress Jung Siren
కాంగ్రెస్ పార్టీ జంగ్ సైరన్

By

Published : Oct 12, 2021, 9:43 PM IST

పాలమూరు గడ్డ నుంచి జంగ్​ సైరన్ ఊదిన కాంగ్రెస్

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల డిమాండ్‌తో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌ (Congress Jung Siren) నిర్వహించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Pcc Chief Revanth Reddy) సహా కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సభలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువతకు కేసీఆర్‌ (Cm Kcr) అన్యాయం చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చేవరకు, విద్యార్థుల బోధనా రుసుంలు విడుదలయ్యే వరకు ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

అవకాశం ఇవ్వండి...

తెలంగాణ పునర్‌ నిర్మాణం పాలమూరు నుంచే మొదలుపెడతామని చెప్పిన కేసీఆర్... మాట తప్పారని మండిపడ్డారు. ఉద్యమ పార్టీగా తెరాస ఆవిర్భావించిన నాటి నుంచి నేడు అధికార పార్టీ వరకు పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్... అన్యాయం చేశారని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారాన్ని పంచుకున్న తెరాస... పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం ద్వారా తెలంగాణ రూపురేఖలు మార్చేందుకు అవకాశం ఇవ్వాలని రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రజలను కోరారు.

సర్కార్​కు హెచ్చరిక...

పాలమూరు గడ్డ మీద జంగ్ సైరన్ సభ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp Leader Bhatti Vikramarka) అన్నారు. ఉద్యోగాలు, విద్య, నదీజలాలు ఇతర వనరుల కోసం ప్రత్యేక తెలంగాణ తెచుకున్నామని... కానీ ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. నీళ్లకోసం తెలంగాణ తెచ్చుకుంటే కృష్ణా నది మీద కట్టాల్సిన ఒక్క ప్రాజెక్టు కేసీఆర్ కట్టలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి అనేక ప్రాజెక్టులు కట్టినట్లు గుర్తుచేశారు. పక్క రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఏడాది కాలంగా కేసీఆర్ నిద్ర పోతున్నాడని దుయ్యబట్టారు. కృష్ణా జలాలు తెలంగాణకు లేకుండా చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు, మల్లురవి, గీతారెడ్డి, మధుయాష్కీ తదితర నాయకులు పాల్గొన్నారు,

స్వల్ప ఉద్రిక్తత...

అంతకుముందు... మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అమిస్తాపూర్‌లో చేపట్టిన జంగ్‌ సైరన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న రేవంత్‌ రెడ్డిని పోలీసులు జడ్చర్ల వద్ద అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. జడ్చర్ల నుంచి నేరుగా జాతీయ రహదారి పై వంతెన మీదుగా సభాస్థలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. పలు చోట్ల అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరకు మహబూబ్‌నగర్​ చేరుకున్నారు.

ఈ పాలమూరు జిల్లాలో విద్యా అవకాశాలు రాలే. కొత్త కాలేజీలు తెరవలే. ఉద్యోగ అవకాశాలు రాలే. ఉన్న పాఠశాలలు మూసిండు. ఫీజు రీఎంబర్స్​మెంట్ ఇవ్వలే. అందుకే ఇయ్యాళ ఈ తెలంగాణ గడ్డకు పాలమూరు మీది నుంచే జంగ్ సైరన్ ఊదుతున్నం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టే ప్రత్యామ్నయం. కేసీఆర్ మెడలు వంచుతం. నాలుగువేల కోట్ల రూపాయల ఫీజుఎంబర్స్​మెంట్ వసూల్ చేస్తం. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసే వరకు బడితే పూజ చేస్తం కేసీఆర్​కు. కేసీఆర్ వల్లనే ఇవాళ మన పాలమూరు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పాలమూరు జిల్లా వెనకబాటు తననానికి కేసీఆర్ బాధ్యుడు కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి.

-- రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్

ఇదీ చూడండి: Jung Siren Tension: జడ్చర్లలో కాంగ్రెస్ శ్రేణులు, పోలీసుల మధ్య స్వల్ప ఉద్రిక్తత

ABOUT THE AUTHOR

...view details