Assigned lands in mahabubnagar : పేదలకు ప్రభుత్వం పంచిన భూములను కొందరు ఫలహారం చేస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం ముసుగులో కొందరు ఉండగా, మరికొందరు దళారులుగా అవతారమెత్తి ప్రభుత్వ భూములకు అక్రమంగా అనుమతులు తెచ్చిపెడుతున్నారు. నగర శివార్లలో వందల ఎకరాలు పలువురు నాయకులు, వ్యాపారుల చేతుల్లోకి వెళ్లాయి. ఎసైన్డ్ పోను మిగిలిన స్థలాలను ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. కొత్త కలెక్టరేట్, ఐటీ పార్కుల నిర్మాణం జరుగుతున్న క్రమంలో చుట్టుపక్కల స్థలాల ధరలు రూ.కోట్లకు చేరాయి. సమీపంలోని ఎసైన్డ్ భూముల విక్రయాలు జోరందుకున్నాయి. ఎసైన్డ్ చట్టం ప్రకారం లావుణి క్రయవిక్రయాలు, దానం, బహుమతి చెల్లదు. సాగు కోసం పంపిణీ చేసిన భూముల్లో భారీ భవంతులు నిర్మిస్తున్నారు. చట్ట ప్రకారం సాగుభూమి మార్పిడికి ‘నాలా’ అనుమతులు పొందాలి. ఇవేమీ లేకున్నా పురపాలక శాఖ భవనాలకు ఉదారంగా అనుమతులిస్తుండగా.. అదే బాటలో కొళాయి, విద్యుత్ కనెక్షన్లు వస్తున్నాయి.
రూ.218 కోట్ల భూమికి రెక్కలు
ఎదిరలో సర్వే నంబరు 556, 607లలో 371.34 ఎకరాలను ఐటీ పార్కుకు కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్ఐఐసీ) భూసేకరణ జరిపి దీన్ని నిర్మిస్తోంది. ఇక్కడ భూమి విలువ ఎకరా రూ.2కోట్లకు పైనే ఉంది. రెండేళ్ల కిందట పార్కు కోసం ఈ రెండు సర్వే నంబర్లలో 481.06 ఎకరాలను తీసుకోనున్నట్లు ప్రకటించారు. రెవెన్యూ రికార్డుల్లోనూ అంతే విస్తీర్ణం నమోదై ఉంది. పార్కు నిర్మాణం వేగం పుంజుకున్నాక డీజీపీఎస్(డిఫరెన్సియేట్ గ్లోబల్ పోజిషనింగ్ సర్వే) చేపట్టారు. ఆ సమయంలో 371.34 ఎకరాలే భూమి ఉందని ప్రకటించారు. అంతే విస్తీర్ణానికి పరిహారమిచ్చేందుకు నోటిఫికేషన్ జారీచేశారు. 109 ఎకరాల స్థలం క్షేత్రస్థాయిలో లేదని ప్రకటించారు. దీనిపై పెద్దఎత్తున ఆందోళనలు చేసిన స్థానికులు తమ భూమిని భారీగా తగ్గించి చూపారంటూ ఆక్రోశించారు. నిస్సహాయ స్థితిలో చివరికి ఇచ్చిన పరిహారమే తీసుకున్నారు. వారి ఎసైన్డ్ భూములను కొందరు కావాలనే ‘మాయ’ం చేశారనే ఆరోపణలున్నాయి. దీనిపై దృష్టిసారించే అధికారులే లేకపోవటం విచిత్రం!
రూ.100 కోట్లకుపైగా లావాదేవీలు
మహబూబ్నగర్లోని క్రిస్టియన్పల్లి సర్వే నంబరు 523/1లో ఎసైన్డ్ భూమిని కొల్లగొడుతున్నారు. ఇక్కడ 83.28 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉంది. 1980-2017 మధ్య కొందరు పేదలకు ప్రభుత్వం పట్టాలివ్వగా.. రెట్టింపు సంఖ్యలో ఆక్రమణలు జరిగాయి. 2017లో కలెక్టర్ అసలైన లబ్ధిదారులు 500 మందిని గుర్తించి ఆ భూములను వెనక్కు తీసుకున్నారు. అక్కడే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అక్కడే మరో 75 మంది దివ్యాంగులకూ పట్టాలచ్చారు. ఆపై.. మిగిలిన భూమికి నకిలీ పట్టాలు సృష్టించి కొందరు నాయకులు వాటిని అమ్మకానికి పెడుతున్నారు. వంద గజాల స్థలాన్ని రూ.10-20 లక్షలకు విక్రయిస్తుండగా.. 2000 మంది కొన్నట్లు అంచనా. చివరకు చిన్నవాగునూ మింగేశారు.