కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని అస్వస్థతకు గురై తుది శ్వాస విడిచింది. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. శనివారం ఉదయం 8వ తరగతి విద్యార్థిని వనిత కడుపునొప్పితో బాధపడుతుందని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అంబులెన్స్లో తరలిస్తుండగా మధ్యలోనే మరణించింది.
సమాచారం ఇవ్వలేదు
తమ కుమార్తె ఆరోగ్యం ఇంత విషమంగా ఉన్నా. కనీస సమాచారం ఇవ్వలేదని విద్యార్థిని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. బంధువుల ద్వారా విషయం తెలుసుకొని ఆసుపత్రికి వచ్చానంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.
బంధువుల ఆందోళన
న్యాయం చేయాలంటూ మృతదేహంతో కురవి మండలం పెద్దతండ వద్ద భద్రాచలం ప్రధాన రహదారిపై బంధువులు రాస్తారోకో చేపట్టారు. రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మహబూబాబాద్ డీఎస్పీ నరేశ్ కుమార్ న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రాస్తారోకో విరమింపచేశారు.
ఇవీ చూడండి :దాడుల ఆధారాలు చూపండి