తెలంగాణ

telangana

ETV Bharat / state

Organ Donation: ఆడుతూ ఓడినా.. ఏడుగురికి పునర్జన్మనిచ్చాడు

Organ Donation: అవసరానికి అవయవం లభ్యం కాకపోవడంవల్ల చాలా మంది రోగులు అర్ధాంతరంగా మృత్యు ఒడికి చేరుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ తల్లిదండ్రులు.. బ్రెయిన్​ డెడ్​ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేశారు. జన్మనిచ్చి పెంచుకున్న కుమారుడు దూరమైనా... మరో ఏడుగురిలో తన అవయవాలను సజీవం చేశారు.

By

Published : Dec 21, 2021, 11:36 AM IST

Organ Donation
అవయవదానం

Organ Donation: కబడ్డీ ఆడుతూ గాయపడి బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ విద్యార్థి... మరో ఏడుగురికి పునర్జన్మనిచ్చాడు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన ఊడుగుల ఐలయ్య-మంజుల దంపతుల కుమారుడు సంతోష్‌. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం జయగిరిలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 8వ తేదీన సంతోష్ కళాశాల ఆవరణలోని తోటి మిత్రులతో కలిసి కబడ్డీ ఆడాడు. ఈ క్రమంలో కిందపడిన సంతోష్ తలకు బలమైన గాయమై.. మెదడులో రక్తం గడ్డకట్టింది.

కళాశాల సిబ్బంది ఎంజీఎం తరలించగా.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. మూడు రోజులు చికిత్స పొందిన తర్వాత బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్దారించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ సంస్థ సభ్యులు అవయవదానంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కొడుకును కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న తల్లిదండ్రులు అవయవదానానికి ముందుకొచ్చారు. సంతోష్‌ శరీరంలోని అవయవాలను తీసి ఏడుగురికి అమర్చారు. అవయవదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టిన సంతోష్‌ సంస్మరణ సభను అతడి సొంతూరైన పెద్దముప్పారంలో నిర్వహించారు.

ఇదీ చూడండి:ప్రాణం తీసిన కబడ్డీ.. తలకు బలమైన గాయమై ఇంటర్ విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details