తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2021, 9:40 AM IST

Updated : Jun 23, 2021, 2:23 PM IST

ETV Bharat / state

Maoist Hari Bhushan: మావోయిస్టు నేత హరిభూషణ్‌ మృతి: ఎస్పీ సునీల్ దత్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందినట్లు భద్రాద్రి ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. కరోనా బారిన పడి.. చివరకు గుండెపోటుతో మరణించారని పేర్కొన్నారు. మరికొందరికి వైరస్ సోకిందని... తమను సంప్రదిస్తే మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు.

Hari Bhushan, sp sunil Dutt
మవోయిస్టు హరిభూషణ్, ఎస్పీ సునీల్ దత్

మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ధ్రువీకరించారు. కరోనాతో బాధపడుతూ... చివరకు గుండెపోటుతో మరణించారని తెలిపారు. మరికొందరికి వైరస్ సోకిందని వెల్లడించారు. మావోయిస్టులు పోలీసులను సంప్రదించాలని సూచించారు. మెరుగైన వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడుతామని హామీ ఇచ్చారు.

ఈ నెల 21న మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి చెందారు. కరోనా బారిన పడిన హరిభూషణ్ గుండెపోటుతో మరణించారు. మరికొందరు మావోయిస్టులు కరోనా బారిన పడ్డారు. పోలీసులను ఆశ్రయిస్తే మెరుగైన వైద్యం అందిస్తాం. కొవిడ్‌తో బాధపడుతున్న వారికి ఏమైనా జరిగితే అగ్రనాయకత్వం దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. మావోయిస్ట్‌ పార్టీని వీడి బయటకు రావాలని చూస్తున్న నాయకులు, సభ్యులను.... అగ్రనాయకత్వం బయటకు రాకుండా అడ్డుపడి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్నిరకాల ప్రతిఫలాలను అందేలా చూస్తాం.

-సునీల్ దత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ

సామాజిక మాధ్యమాల్లో ప్రచారం

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ హెచ్‌బీ అలియాస్‌ లక్మాదాదా ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం కలకలం రేగింది. తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించి సోమవారం రాత్రి మృతిచెందారనే వార్తలు సామాజిక మాధ్యమాల్లో గుప్పుమన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మీనగట్ట ప్రాంతంలో ఆయన మృతిచెందినట్లు దంతేవాడ పోలీసు ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారంటూ బస్తర్‌ ప్రాంతానికి చెందిన మీడియా సంస్థ ట్విటర్‌లో పేర్కొంది.

మడగూడ నుంచి కేంద్ర కమిటీకి..

మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం మడగూడకు చెందిన యాప నారాయణ పదో తరగతి వరకు చదువుకొని విప్లవ కార్యకలాపాల వైపు ఆకర్షితుడయ్యారు. గుత్తికోయ సామాజిక వర్గానికి చెందిన నారాయణ దండకారణ్యానికి బదిలీ అయ్యాక అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా నియమితులై కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్‌ చంద్రన్న మార్గదర్శకత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా.. కొంతకాలం క్రితం హరిభూషణ్‌ను మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలోకి తీసుకున్నారు.

కరోనాతో హరిభూషణ్‌ చనిపోయినట్లు జరుగుతున్న ప్రచారం తమను క్షోభపెడుతోందని ఆయన చిన్న తమ్ముడు అశోక్‌ పేర్కొన్నారు. దీనిపై కుటుంబ సభ్యులు క్లారిటీ ఇవ్వాలని కోరగా... హరిభూషణ్​ మృతిని ఎస్పీ ధ్రువీకరించారు.

ఇదీ చదవండి:MAOIST LEADER: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతి!

Last Updated : Jun 23, 2021, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details