చెట్టు లెక్కగలనే... ఓ చెంచిత పుట్టలెక్కగలనే... అంటూ నాటి సినిమాలో ఓ కథనాయిక అడిగిన ప్రశ్నకు... తడుముకోకుండా సమాధానం చెపుతాడు కథానాయకుడు. అప్పట్లో చిత్రానికే హైలెట్గా నిలిచిన ఈ పాటకు... దశాబ్దాలు గడిచినా అదేస్థాయిలో ఆదరణ ఉంటుంది. అదే ప్రశ్న... ఈ నారీమణిని అడిగితే... చెట్లేంటి.. ఏకంగా కరెంటు స్తంభాలే... సునాయాసంగా ఎక్కగలనంటోంది. క్షణాల్లోనే స్తంభాన్ని ఎక్కి దిగుతూ... పురుషులతో పోల్చితే తానేం తక్కువ కానంటోంది భారతి.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం బోజ్యాతండా గ్రామ పంచాయితీలోని దేశ్యాతండాకు చెందిన వాంకుడోతు భారతి దేశంలోనే తొలి జూనియర్ లైన్మెన్గా ఎంపికై రికార్డు నెలకొల్పింది. భారతి పుట్టి పెరిగింది జనగామ జిల్లా కొడకండ్ల మండలం మెండ్రాయ్ గ్రామం సుతారిగడ్డ తండా. సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం వల్ల చిన్ననాటి నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు.. పనులు చేసుకుంటూనే పై చదువులు చదివింది. కాకతీయ వర్శిటీ నుంచి ఎంకాం పట్టా పొందింది. 2012లో పెళ్లి కాగా... ఆ తరువాత... ఇంటి పని, పిల్లల చదువులతో క్షణం తీరిక లేకున్నా పట్టుదలతో... 2016లో ఐటీఐ ఎలక్ట్రీషియన్ కోర్సు పూర్తి చేసింది. స్త్రీలకు పోటీ తక్కువుగా ఉంటుందని....ఈ కోర్సును ఎంచుకుంది.
ఎన్నో అడ్డంకులకు ఎదురొడ్డి
లైన్మెన్గా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకున్న భారతికి అనేక కష్టాలు తప్పలేదు. చివరకి కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుని పరీక్ష రాసి.. అర్హత సాధించారు. పోల్ టెస్ట్ కోసమూ కోర్టు చుట్టూ పలుమార్లు తిరిగారు. చివరకు గతేడాది డిసెంబర్ 23 భారతి పోల్టెస్ట్కు అర్హత సాధించింది. ఎట్టకేలకు ఉద్యోగానికి అర్హత సాధించడంతో... భారతి ఆనందానికి అవధులు లేవు. భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో...ఇది సాధించానని చెపుతున్నారు. లాక్ డౌన్ కారణంగా పోల్ టెస్ట్ జరగడంలోనూ ఆలస్యమైందని.. మొత్తానికి కష్టానికి తగ్గ ఫలితం లభించిందని....భారతి భర్త చెపుతున్నారు.