తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటూ మిల్లు ఎదుట రైతుల రాస్తారోకో - farmers protests at korukondapally rice mill in mahabubabad district

ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటూ మహబూబాబాద్​ జిల్లా కోరుకొండపల్లిలో రైస్​ మిల్లు ఎదుట అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ధాన్యం రవాణాకు ట్రాక్టర్ల కిరాయి పెరిగిపోతుందని.. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.

farmers protests at korukondapally rice mill
కోరుకొండపల్లి రైసు మిల్లు ఎదుట ఆందోళన

By

Published : May 15, 2021, 4:42 PM IST

ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలంటూ మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి రైస్ మిల్లు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. దీంతో రైస్ మిల్లు ముందు వాహనాలు బారులు తీరాయి. కేసముద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ నిర్వాహకులు.. రైతుల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటాలు వేశారు.

అకాల వర్షాలు పడే అవకాశం ఉండటం.. లారీలు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో రైతులు కిరాయి ట్రాక్టర్లలో ధాన్యాన్ని కోరుకొండపల్లి శివారులోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. కానీ మిల్లు నిర్వాహకులు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడంతో ట్రాక్టర్ల కిరాయి పెరిగిపోతోందని, ఇక్కడ సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యం దిగుమతికి చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రాథమిక సహకార సంఘం పరిధిలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సంఘం కార్యదర్శి వెంకటాచలం అన్నారు. మొన్నటి వరకు మిల్లు నిర్వాహకులు దిగుమతి చేసుకున్నారని, నిన్నటి నుంచి చేసుకోవడం లేదని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:ఆ కుర్రాడికి చెట్టే ఐసోలేషన్​ గది... ఎందుకంటే..!

ABOUT THE AUTHOR

...view details