తెలంగాణ

telangana

ETV Bharat / state

నెమలి పింఛం ఆడేన్​.. పద్మశ్రీ వరించేన్​... - గుస్సాడి కనక రాజు వార్తలు

అది చారిత్రాత్మక గిరి పల్లె... అక్కడ గిరి కుసుమం వికసించింది. ఆదివాసీ సంస్కృతికి వన్నె తెచ్చింది. వారి సంప్రదాయ నృత్యం గుస్సాడీ కీర్తిని ఎర్రకోట వరకు చాటింది. భారత ప్రధాని ఇందిరా గాంధీ కాలికి అందేకట్టి నృత్యాన్ని చేయించింది. ఆ తర్వాత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం సమయంలోనూ ప్రశంసలందుకుంది. గిరిజన జాతికి అరుదైన గౌరవాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక 2021 పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. పద్మశ్రీ అంటే ఏమిటో తెలియని ఆ పద్మ మే కనకరాజు... గిరిజన సాంప్రదాయ కల గుస్సాడి నృత్యంలో రారాజు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పద్మశ్రీ పురస్కార గ్రహీతగా చరిత్రకెక్కిన రాజు జీవన ప్రస్థానంపై ప్రత్యేక కథనం.

kanaka raju
kanaka raju

By

Published : Jan 27, 2021, 8:19 PM IST

Updated : Jan 27, 2021, 10:41 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో గుట్టపై ఉన్న గిరి పల్లె మార్లవాయి కనకరాజు జన్మస్థలం. పేద రైతు దంపతుల రాము, రాజుభాయిల ఏకైక కుమారుడు ఆయన. 80 ఏళ్ల వయసున్న రాజుకు ఆ రోజుల్లో విద్యావకాశాలు లేవు. ఓ మాస్టారు దగ్గర మరాఠీ అక్షరాలు మాత్రమే నేర్చుకున్నారు. తండ్రితో వ్యవసాయ పనులకు వెళ్లేవారు. రాజుకు ఇద్దరు భార్యలు.. పెద్ద భార్య పార్వతీబాయి ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు... చిన్న భార్య భీమ్ భాయికి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులంతా వ్యవసాయం చేస్తున్నారు. గుస్సాడీ నృత్యమే ఆలంబనగా కనకరాజు పెరిగారు. తనకు భారత ప్రభుత్వం ఇంత గొప్ప పురస్కారం ఇస్తుందని ఆయన కలలో కూడా ఊహించలేదు. పద్మశ్రీ అవార్డు ఒకటుందని కూడా తెలియదు అంటున్నారాయన.

ఆదివాసీ గూడెం నుంచి దిల్లీ వరకు...

1982 దేశ రాజధాని దిల్లీ ఎర్రకోట గణతంత్ర వేడుకలకు ఉమ్మడి రాష్ట్రం నుంచి గిరిజన సంప్రదాయ నృత్య ప్రదర్శనకు అవకాశం వచ్చింది. అప్పటి ఆదివాసీ తొలి ఐఏఎస్ అధికారి సిడాం తుకారాం మార్లవాయిలోని కనకరాజు నృత్య ప్రతిభను చూసి వారి బృందాన్ని ఎర్రకోట వేడుకల్లో పాల్గొనే అవకాశం కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇందుకు జైనూరు మండలం పిట్టగోడలో ఏర్పాటుచేసిన రెండు మాసాల శిబిరంలో కనకరాజు నేతృత్వంలో 100 మంది యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో ప్రతిభ చూపిన 35 మందిని దిల్లీకి తీసుకెళ్లారు.

సంక్రాంతి రోజున దిల్లీకి చేరుకున్న ఈ బృందం ఎర్రకోట వద్ద 12 రోజులు, ఇండియా గేట్ వద్ద రెండు రోజులు, బాపూజీ ఘాట్ వద్ద ఒక రోజు ప్రదర్శనలిచ్చారు. గణతంత్ర వేడుకల సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వీరి వద్దకు వచ్చి ప్రశంసించారు. ఆ సమయములో కనకరాజు ఇందిరా గాంధీకి స్వయంగా గుస్సాడి నెమలి పింఛాల టోపీని ధరింపజేశారు. గజ్జలు ఇచ్చి ఆమెను కట్టుకోవాలని కోరారు. ఆ తర్వాత ఆమె ఏడు నిమిషాల పాటు తమతో కలిసి నృత్యం చేశారని రాజు తన జ్ఞాపకాలను పంచుకున్నారు.

హైమన్​డార్ఫ్​తో కలిసి ముందుకు...

ఆదివాసీల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసిన బ్రిటిష్ పరిశోధకుడు, ప్రొఫెసర్ హైమన్​డార్ఫ్​తో సన్నిహితంగా ఉండేవారు కనకరాజు. తనకు తొమ్మిదేళ్ల వయసు ఉన్నప్పుడు తనకు అన్నం తినిపించారని గుర్తు చేసుకున్నారు. పాఠశాలలను నెలకొల్పడంలో, గిరిజనులకు పోడు భూముల పంపిణీలో, గిరిజన సహకార సంస్థ ఏర్పాటు విషయంలో హైమన్ డార్ఫ్​కు అండగా నిలిచారు.

ప్రత్యేక ప్రదర్శనలు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పలు సాంప్రదాయ నృత్య కళా బృందాలతో పాటు కనకరాజు గుస్సాడి బృందం... రాష్ట్రపతి అబ్దుల్ కలాం పాల్గొన్న ఎర్రకోట వేడుకల్లోనూ ప్రదర్శనలిచ్చారు. తుడుందెబ్బ నాయకుడు సిడాం శంభు నేతృత్వంలో ఈ బృందం దిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ సమయంలో కలాం ప్రత్యేకంగా గుస్సాడి నృత్య కళాకారులమైన తమను ప్రశంసించారని రాజు తెలిపారు. జిల్లాలో, రాష్ట్ర రాజధానిలో పలుమార్లు తన బృందంతో సాంప్రదాయ నృత్య వైభవాన్ని చాటారు. అప్పటినుంచి కనకరాజు పేరు కాస్త గుస్సాడీ రాజుగా మారింది.

'గుస్సాడీ'లో యువతకు శిక్షణ

పూర్వీకులు అందించిన సాంప్రదాయ నృత్యాన్ని ఆదివాసీలు భగవత్(పెర్సపెన్) స్వరూపంగా తలుస్తారు. దీనికి చేచోయ్ నృత్యం అని కూడా పేరు. ఓ గ్రామం నుంచి మరో గ్రామానికి దీపావళి దండోరా సమయంలో వెళ్లి నృత్యం చేయడం ఆదివాసీల ఆనవాయితీ. అతి పవిత్రంగా భావించే ఈ నృత్యాన్ని కనకరాజు తన తండ్రి రాము, గ్రామ పెద్ద కనకా సీతారాం ఆధ్వర్యంలో ఆదివాసీ గూడేల్లో ప్రదర్శించే సమయంలో ప్రేరణకు గురై వారితో కాలు కదిపారు. కొద్ది రోజుల్లోనే రాజు తన బృందం వారికి శిక్షకుడిగా మారారు. ఆసక్తి ఉన్న యువకులకు ఇప్పటికి శిక్షణ ఇస్తున్నారు.

నెమలి పింఛం ఆడేన్​.. పద్మశ్రీ వరించేన్​...

ఇదీ చదవండి :"గుస్సాడీ కనకరాజు'కు పద్మశ్రీ.. గిరిజన జాతికిచ్చిన పురస్కారం"

Last Updated : Jan 27, 2021, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details