తెలంగాణ

telangana

By

Published : Jan 18, 2021, 6:45 AM IST

ETV Bharat / state

తాడోబా అడవులకు మగపులి.. 'ఏ2 ఆపరేషన్‌'కు బ్రేక్​...

ఆసిఫాబాద్ జిల్లాలో పులిని బంధించేందుకు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు. రెండు నెలలుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న ఏ2(మగ) పులి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యానికి జారుకున్నట్లుగా పాదముద్రల ఆధారంగా గుర్తించారు. ఈ క్రమంలో ‘ఆపరేషన్‌ ఏ2’ కు తాత్కాలిక విరామం ఇచ్చారు. బెబ్బులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన అటవీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.

operation-a2-has-been-suspended-temporarily
తాడోబా అడవులకు జారుకున్న మగపులి

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్‌ మండలంలోని కందిభీమన్న అటవీ ప్రాంతంలో అధికారులు ఉంచిన ఎరను 11న తిన్న పులిని బంధించేందుకు సమీపంలోనే మంచెను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో పులి ఇక్కడికి రెండుసార్లు వచ్చి మిగిలిన మాంసాన్ని తిన్నప్పటికీ ఈ వేళల్లో మత్తుమందు ప్రయోగించడానికి వీలుకాకపోవడం పులికి కలిసొచ్చింది. ప్రశాంతంగా ఉండే అడవిలో మంచెలు కనిపించడం, సిబ్బంది సంచారంతో ఏర్పడిన శబ్దాలతో ప్రమాదం పసిగట్టిన పులి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ నెల 14 నుంచి పులి కదలికల ఆచూకీ లభించలేదు. కందిభీమన్న అటవీ ప్రాంతానికి అయిదు కిలోమీటర్ల దూరంలో, నందిగాం పక్కనే ప్రాణహిత నదిని దాటి తాడోబా అభయారణ్యానికి పులి వెళ్లినట్లుగా సిబ్బంది గుర్తించారు. బెజ్జూరు మండలంలో రెండు ఆడపులులు తిరుగుతున్నందున వాటికోసం అది మళ్లీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

మహారాష్ట్రకు వెళ్లడం మామూలే..

పులి కోసం వారం రోజులుగా గాలిస్తూనే ఉన్నాం. శనివారమే కాదు.. గాలింపు సమయంలోనూ రెండుసార్లు పులి మహారాష్ట్ర అడవులకు వెళ్లి వచ్చింది. దాని అనుపానులు గమనించేందుకు ప్రస్తుతం 240 కెమెరాలను కందిభీమన్న, మొర్లిగూడ అటవీ ప్రాంతాల్లో అమర్చాం. ఏ2 పులిని బంధించే వరకు ఆపరేషన్‌ కొనసాగుతుంది.

- శాంతారాం, డీఎఫ్‌వో

ABOUT THE AUTHOR

...view details