తెలంగాణ

telangana

ETV Bharat / state

పునరావాస ప్లాట్లు కొల్లగొడుతున్న కబ్జాదారులు - kumuram bheem project

అన్నం పెట్టే భూమిని, ఆశ్రయమిచ్చే ఇంటిని జలాశయం కోసం ఇచ్చిన త్యాగధనులను కన్నీళ్లే వెంటాడుతున్నాయి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి పంపిణీ చేసిన భూములు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. రెండేళ్ల క్రితమే అక్రమాలను గుర్తించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అదునుగా భావించి కబ్జాదారులు ముఠాగా ఏర్పడి ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.

పునరావాస ప్లాట్లు కొల్లగొడుతున్న కబ్జాదారులు

By

Published : Apr 24, 2019, 11:17 PM IST

కుమురం భీం జలాశయం నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామస్థుల కోసం 11 కాలనీలు ఏర్పాటు చేశారు. అడా ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 2008లో ఆసిఫాబాద్ శివారులో సర్వే నంబరు 249లో గల ప్రభుత్వ స్థలంలో 324 ప్లాట్లు పంపిణీ చేయగా... మరో 56 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మరికొందరికి జానకపూర్ సమీపంలోని భాగ్యనగర్ వద్ద పునరావాసం కల్పించారు. నూతన జిల్లాగా ఏర్పడిన ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం వెనకే ఈ కాలనీ ఉండటం, అంతర్రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండటం వలన అక్రమార్కులు రంగంలోకి దిగారు.

పునరావాస ప్లాట్లు కొల్లగొడుతున్న కబ్జాదారులు

అక్రమార్కుల చేతివాటం

జిల్లా కేంద్రంలో కబ్జాల దందా చేస్తున్న ముఠాకు ఖాళీ ప్లాట్లను అంటగడుతూ అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. ఐదువందల ప్లాట్లలో కేవలం 70 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. చాలామంది అనేక కారణాలతో గృహాలను నిర్మించుకోలేదు. ఖాళీ స్థలాలతోపాటు నిర్వాసితులు వదిలేసిన వాటిని కూడా అధిక ధరకు విక్రయిస్తున్నారు. గ్రామపంచాయతీ అనుమతితో నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తుండటంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 11 పునరావాస గ్రామాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని, అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆలయాల ప్లాట్లూ స్వాహా

పూలాజీ బాబా ఆలయం, జ్యోతిబా పూలే విగ్రహం ఏర్పాటుకు కేటాయించిన రెండు ప్లాట్లు సైతం అన్యాక్రాంతమై పోవడం పట్ల కాలనీవాసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తమకు కేటాయించిన ప్లాట్లలో గృహాలు నిర్మించుకున్నప్పటికీ ఈ స్థలం ఇతరుల పేరు మీద ఉండటంతో కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. అక్రమార్కులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పేరుకే పునరావాసం

పునరావాసాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలు సత్య దూరంగానే ఉన్నాయి. 20కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉన్న మోవాద్ గ్రామం నుంచి విద్యుత్ కనెక్షన్ కల్పించారు. సరఫరాలో తరచూ తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. పేరుకే పునరావాస కాలనీ అయినా... కనీస వసతులు కరవయ్యాయని మహిళలు నిట్టూరుస్తున్నారు.

ఇవీ చూడండి: నీటి దందాకు అడ్డాగా ఐటీ కారిడార్

ABOUT THE AUTHOR

...view details