తెలంగాణ

telangana

ETV Bharat / state

యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా.. పట్టించుకోని యంత్రాంగం - government lands occupied in kagaznagar municipality

ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. దళారులు ముందుగా నాలుగు సిమెంట్‌ స్తంభాలను పాతుతారు. మరి కొందరు ఏకంగా పక్కా గృహాలను నిర్మిస్తున్నారు. ఆ స్థలం తమదేనంటూ విక్రయిస్తున్నారు.. ఎలాంటి అనుమతి పత్రాలు... ఇతర ఆధారాలేవీ లేకున్నా అతి తక్కువ ధరలకే లభిస్తోందని కొందరు కొనుగోలు చేసి నష్టపోతున్నారు. ఇదీ కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ పురపాలిక సరిహద్దులోని బోరిగాం, చారిగాంలలో పరిస్థితి.

government lands occupied in kagaznagar municipality in asifabad district
కాగజ్​నగర్​లో యథేచ్ఛగా ప్రభుత్వ స్థలాల కబ్జా

By

Published : Sep 19, 2020, 2:48 PM IST

రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ కరవవడంతో విలువైన ప్రభుత్వ భూమి కబ్జా కోరల్లోకి వెళ్లిపోతోంది. ఇది ప్రభుత్వ స్థలమంటూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని మాయం చేస్తున్నారు. మరోచోట ఆ బోర్డును కొంతదూరం మార్పు చేసి, మరీ ఆక్రమించుకుంటున్నారు.

2004-05లో అప్పటి ప్రభుత్వం కాగజ్‌నగర్‌ పురపాలికలోని ఆదర్శ వార్డులను ఎంపిక చేసింది. పట్టణంలోని 28 వార్డుల్లో నివాస స్థలం.. పక్కా గృహం లేని 1304 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. పట్టణం, సమీపంలోని ప్రభుత్వ స్థలం లేక పోవడంతో కాగజ్‌నగర్‌ మండలంలోని బోరిగాం, చారిగాం ఏరియాలోని సర్వేనెం.117,119,120,125,126లో పట్టాదారుల నుంచి దాదాపు 71 ఎకరాల భూములను రూ.2.70 కోట్లతో కొనుగోలు చేశారు.

పురపాలిక ఆధ్వర్యంలో లే-అవుట్‌ తయారు చేసి, ప్లాట్లుగా విభజించారు.ఎంపికైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం కూడా పక్కా గృహాలను మంజూరు చేసింది. ఇళ్ల పనులు దక్కించుకున్న ఓ గుత్తేదారు ఆ గృహాలను నాసిరకంగా నిర్మించడంతో అవన్నీ ప్రారంభానికి ముందే శిథిలమయ్యాయి.దీంతో లబ్ధిదారులు ఆ ఇళ్లల్లో ఉండేందుకు అంగీకరించలేదు.ఆ ఇళ్లన్ని నిరుపయోగంగా మారడంతో కబ్జాదారుల కన్ను వీటిపై పడింది.

బోరిగాం శివారులో 25 ఎకరాల్లో రూ.25 కోట్ల వ్యయంతో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు శరవేగంతో సాగుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్నుపడింది. మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని భావించి, దళారులు, తదితరులు ప్రభుత్వ భూమిలోని పిచ్చిమొక్కలను తొలగించడం, రాత్రికి రాత్రే పునాదులను తవ్వడంచేస్తున్నారు. మరికొందరు ఏకంగా భవనాల నిర్మాణాలు చేపడుతున్నారు.

రీ సర్వేలు జరిపి అర్హులకు కేటాయించాలి

ఈ భూముల్లో గతంలో కేటాయించిన పట్టాలను రద్దు చేసి రీ సర్వేలు చేయాలని పట్టణవాసులు కోరుతున్నారు. నివాస, పక్కా గృహం లేని అర్హులను ఎంపిక చేసి, వారికి ఆ స్థలాన్ని కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమణదారులపై సమగ్ర విచారణ జరిపి, అర్హులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

నోటీసులు జారీ

ప్రభుత్వ భూమిని అక్రమించుకుని పక్కాగృహాలు నిర్మిస్తున్న వారందరికీ నోటీసులను జారీచేశాం. ప్రభుత్వ భూమిని అక్రమించరాదంటూ ఆదేశాలు ఇచ్చాం. బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఆక్రమణలుగా తేలితే కూల్చివేస్తాం.

- ప్రమోద్‌కుమార్‌, తహసీల్దార్‌

ABOUT THE AUTHOR

...view details