కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం దిగిడ అటవీ ప్రాంతంలో పశువులను మేపేందుకు వెళ్లిన వ్యక్తిపై పులిదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
దిగిడ అటవీ ప్రాంతంలో పులి కోసం అటవీ అధికారుల వేట - Telangana forest officers
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగం మండలం దిగిడ అటవీ ప్రాంతంలో మనిషిని చంపిన పులి కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. నాలుగు బోన్లు ఏర్పాటు చేసి పులిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

పులి కోసం అటవీ అధికారుల గాలింపు
ప్రమాదం జరిగిన సమీపంలో నాలుగు బోన్లు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు.. మేకలు, దూడలను ఎరగా ఉంచారు. పులి కదలికలు కనిపెట్టడానికి.. ఎనిమల్ ట్రాకర్స్, 30 కెమెరాలు ఏర్పాటు చేశారు. దాడి చేసిన పులి మహారాష్ట్ర నుంచి వచ్చిందని, సమీప ప్రాంతాల్లో ఆనవాళ్లు కనిపించకపోవడం వల్ల మహారాష్ట్ర వైపు వెళ్లి ఉంటుందని రెబ్బెన రేంజ్ అధికారిణి పూర్ణిమ తెలిపారు. మరో పదిరోజుల వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.