తెలంగాణ

telangana

ETV Bharat / state

శరణార్థుల పల్లెల్లో.. నకిలీల బాగోతం..! - Fake Aadhar Card Updates

ఐదు దశాబ్దాలకిందట పొరుగుదేశం నుంచి వచ్చిన వారికి శరణార్ధులుగా ఆశ్రయం కల్పించిన చోటు ఇది..! అప్పటినుంచి ఉత్తరాది రాష్ట్రాలతో సంబంధ బంధవ్యాలు కొనసాగుతున్నాయి. ఇదే అదనుగా చుట్టం చూపు పేరుతో కొందరు ఆధార్‌ కార్డు దందాకు తెరలేపారు. స్థానిక ధ్రువీకరణ పత్రాలు పొంది... ఏకంగా సైన్యంలోనే ఉద్యోగాలు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

in-the-countryside-of-refugees
శరణార్థుల పల్లెల్లో.. నకిలీల బాగోతం..!

By

Published : Feb 12, 2020, 7:19 AM IST

Updated : Feb 12, 2020, 5:44 PM IST

శరణార్థుల పల్లెల్లో.. నకిలీల బాగోతం..!

పాక్‌ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన సమయంలో వేలాదిమంది శరణార్థులు భారత్‌కు వలస వచ్చారు. వారికి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ...కాగజ్‌నగర్ సమీపంలో పునరావాసం కల్పించారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని పలు గ్రామాల్లో 18 వేల మంది ప్రస్తుతం స్థిరనివాసం ఏర్పరచుకొని జీవిస్తున్నారు. వారుంటున్న 13గ్రామాలను నజ్రుల్‌నగర్‌ పంచాయతీగా ఏర్పాటుచేశారు.

ప్రతి గ్రామంలో ఆధార్‌కార్డు దందా

కాందిశీకులుగా వచ్చిన వారికి కులంతోపాటు ఇతర ధ్రువీకరణ సమస్యల వల్ల సైన్యంలో చేరేందుకు కొన్ని స్వల్ప మినహాయింపులు ఇచ్చారు. వాటి ఆధారంగానే ఆర్మీలో ఉద్యోగాలు పొందుతున్నారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు ఆధార్‌కార్డు దందాకు తెరలేపారు.

దళారులకు కాసుల పంట

నజ్రుల్‌నగర్ పరిధిలో జీవిస్తున్న కుటుంబాలకు బెంగాలీలతో సంబంధాలు కొనసాగుతున్నాయి. వ్యాపారాల లావాదేవీలు.. ఇతర అంశాల కారణంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఇక్కడికి తరచూ వస్తుంటారు. ఆ విషయాన్ని ఆసరాగా చేసుకొని కొందరు స్థానిక దళారులతో కలిసి ఆధార్‌ కార్డు దందాకు తెరతీశారు.

లక్షల్లో డబ్బు వసూలు

ఆధార్‌ పొందేందుకు దళారులు లక్షల్లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. కార్డు పొందిన తర్వాత స్థానిక SI, రెవెన్యూ అధికారులు సంతకం చేసిన పత్రాలు తీసుకొని ఏకంగా సైన్యంలో చేరుతున్నారనే ఆరోపణలున్నాయి.

దొంగ సంతకాలు.. నకిలీ పత్రాలు..

8వ నంబర్‌ గ్రామానికి చెందినవ్యక్తినని చెప్పుకుంటూ ఒకరు కుల ధ్రువీకరణ, క్యారెక్టర్ ధ్రువీకరణ పత్రంపై నజ్రుల్‌నగర్ సర్పంచ్ సంతకం చేయడం కలకలం రేపుతోంది. ఆ గ్రామం బసంతినగర్ పరిధిలోకి రావడం వల్ల ఈ పంచాయతీలోనే సంతకం చేయాలి. దళారుల సహాయంతో నజ్రుల్ నగర్ పంచాయతీలో చేయించారు. అదేవిధంగా మరికొందరు ఆధార్ కార్డులు, అధికారుల అటెస్టెడ్ సంతకాలు తీసుకున్నారని తెలుస్తోంది.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ ఆధార్‌దందా మరింత విస్తరించకముందే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి:కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్‌

Last Updated : Feb 12, 2020, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details