తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరిని కలుపుకుంటూ.. అభివృద్ధికి బాటలు - konijerla ae raghothama reddy

ఏసీ గదిలో కూర్చునే స్థాయి ఆయనది. పదవీ విరమణ సమయం దగ్గరపడుతోంది. అయినా.. ఐదు పదులు దాటిన వయస్సులో క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతులు, వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉన్నా.. తానే స్వయంగా సిబ్బందిని తీసుకెళ్లి.. పరిష్కరిస్తూ ఉద్యోగ ధర్మాన్ని అంకితభావంతో నిర్వర్తిస్తున్నారు. ఐదేళ్లపాటు అక్కడే పనిచేసి బదిలీ అయినా.. ప్రజల కోరిక మేరకు మళ్లీ అదే ప్రాంతానికి వచ్చి సేవలందిస్తోన్న ఆయనే ఖమ్మం జిల్లా కొణిజర్ల విద్యుత్ శాఖ ఏఈ రఘోత్తమ రెడ్డి.

Konijarla Ae Raghothama Reddy of
కొణిజర్ల ఏఈ రఘోత్తమ రెడ్డి

By

Published : Feb 25, 2021, 6:55 PM IST

కొణిజర్ల ఏఈ రఘోత్తమ రెడ్డి

విద్యుత్‌శాఖలో కొలువంటేనే కత్తిమీద సాము లాంటిది. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియని పరిస్థితి. వర్షాకాలంలో కష్టాలు వర్ణనాతీతం. అలాంటి శాఖలో ఎలాంటి అంతరాయం లేకుండా సేవలందిస్తూ మండల ప్రజల మన్ననలు పొందుతున్నారు ఏఈ రఘోత్తమరెడ్డి. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంతోపాటు వైరా పురపాలికలో కొన్ని వార్డులు తన పరిధిలో ఉండటంతో రెండు వైపులా ఉత్తమ సేవలందిస్తూ ప్రజాప్రతినిధుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 58 ఏళ్లు. నాలుగు నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా ఆ మాట మరిచిపోయినట్లు ఇప్పటికీ చేను, చెలకల్లో తిరుగుతూ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. పట్టణ ప్రగతి ద్వారా పురపాలక గ్రామాల్లో, పల్లె ప్రగతి ద్వారా మండలంలోని గ్రామాల్లో స్తంభాలు ఏర్పాటు, తీగల మరమ్మతులు త్వరితగతిన చేపట్టి జిల్లాలోనే ఉత్తమ ఏఈగా మన్ననలు పొందారు.

ఎల్లకాలం గుర్తుండేలా..

మండలంలో విద్యుత్‌ సమస్యలపై పట్టున్న రఘోత్తమరెడ్డి వాటి పరిష్కారం దిశగా దశల వారీ చర్యలు చేపట్టారు. ఎక్కువగా సమస్య ఉన్న బస్వాపురం, లింగగూడెం పంచాయతీని దత్తత తీసుకుని కొత్త స్తంభాలు, నియంత్రికలు ఏర్పాటు చేసి సమస్యలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఆ గ్రామం పూర్తిగా వ్యవసాయాధారితం కావడం వల్ల తీగలు కిందకు వేలాడుతూ గడ్డి ట్రాక్టర్లు వచ్చే వీలు లేకపోవడంతో ఉన్నతాధికారులను ఒప్పించి పెద్ద స్తంభాలు ఏర్పాటు చేశారు. తన సేవలకు ఆ గ్రామస్థులు ఎన్నటికీ గుర్తుండే విధంగా పనులు చేశారు. అదే తరహాలో చాలా గ్రామాల్లో సేవలు చేశారు.

ప్రజలకు అవగాహన

వినియోగదారులతోపాటు రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏఈ... వ్యవసాయ కనెక్షన్ల నుంచి సరఫరా అంతరాయం లేకుండా ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రధాన సమస్యను పరిష్కరించారు. సుబాబుల్, జామాయిల్‌ కర్రల కింద తీగలు తగుతులూ ఉండటం వల్ల అంతరాయం ఎక్కువగా ఏర్పడుతోందని గ్రహించి.. ఆ కర్రలను నరికించి సమస్య పరిష్కరించారు. రైతులకు తీగలు, చెట్లు తగలడం వల్ల.. నష్టాలు, విద్యుత్‌ పొదుపు వంటి వాటిపై ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తున్నారు. తన కార్యాలయం, విద్యుత్‌ ఉప కేంద్రాలను స్వచ్ఛత, పచ్చదనంతో ఉండే విధంగా తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారు.

స్నేహశీలి

వృత్తి ధర్మంతోపాటు గ్రామంలో అందరితో స్నేహంగా మెలగడం, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి పలువురి మన్ననలు పొందుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తాత్కాలిక ఉద్యోగులకు సాయం అందించి, సిబ్బందికి తోడుగా నిలిచారు. రఘోత్తమరెడ్డిని స్పూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ వృత్తి పట్ల నిబద్ధత చాటితే ప్రజలకు చక్కటి సేవలందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details