చేతిలో ఉన్న కెమెరానే ఆయుధంగా...ఫొటోల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న ఈ యువకుడి పేరు కోరె సాయికిరణ్. పాతికేళ్ల ప్రాయంలోనే ఓ బృహత్ కార్యక్రమాన్ని భుజానికెత్తుకుని, నేతన్నలకు అండగా నిలుస్తున్నాడు. అంబాసిడర్లు చేయలేని ప్రచారాన్ని తన ఫొటోల ద్వారా విస్తృతంగా చేస్తున్నాడు. నేటితరం అభిరుచులకు అనుగుణంగా చేనేత వస్త్రాలనే సరికొత్త డిజైనర్ దుస్తులుగా అందుబాటులోకి తెచ్చి, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాడు.
ఫొటోగ్రఫీ ప్రస్థానం
సాధారణ ఫొటోగ్రాఫర్ అయిన సాయికిరణ్కు.. ఓ జంటను చేనేత కళాకారులుగా ఫోటోలు తీయాలన్న ఆలోచన వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన సాయికిరణ్.... పాఠశాల స్థాయి నుంచే చిన్నచిన్న పనులు చేసి, ఆర్థికంగా కుటుంబానికి అండగా నిలబడేవాడు. ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో....పొదుపు చేసుకున్న చిట్టీ డబ్బులతో ఓ కెమెరా కొన్నాడు. అలా ఎన్నో ఆటంకాలతో మొదలైంది సాయికిరణ్ ఫోటోగ్రఫీ ప్రస్థానం.
అందరికంటే భిన్నంగా ఫొటోలు తీస్తాడని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయికిరణ్. ఏటా ముంబయిలో జరిగే ఫొటోగ్రాఫర్ల సదస్సులో....వివిధ దేశాల ఫొటోగ్రాఫర్ల నుంచి మెలకువలు తెలుసుకొని, నిత్యం తన ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నాడు. ఈకోర్ ఫోటోగ్రఫీ అనే సంస్థను స్థాపించి ఎంట్రప్రెన్యూర్ అవతారమెత్తాడు. ఓ వేడుకలో చేనేత వస్త్రాల వైభవానికి ఆకర్షితుడై....చేనేత కార్మికులకు తనవంతుగా సహాయపడాలని నిర్ణయించుకున్నాడు.