తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు

మిరపకు ధర ఆశాజనకంగా ఉన్నా కోసేందుకు కూలీలు లేక అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు నెల ముందుగానే తిరుగు పయనం కావడంతో సాగుదారుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. స్థానికంగా ఉన్న కూలీలు సరిపోకపోవడం వల్ల దిగుబడులు పొలాల్లోనే ఎర్రబారి దెబ్బతింటున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు చందాగా అకాల వర్షాలతో పండిన కాయలు రాలిపోతూ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రెట్టింపు కూలీ ఇస్తూ కోతలు చేయించాల్సి వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు కూలీల కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

By

Published : Apr 25, 2021, 8:04 PM IST

mirchi farmers problems, khammam mirchi farmers problems
రైతులకు నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు

ఈ ఏడాది అధిక వర్షాలతో వరి, పత్తి పంటలు అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఆ పంటల్లో పెట్టుబడులు కూడా రాకపోవడంతో చాలావరకు కర్షకులు అప్పుల పాలయ్యారు. కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ తరుణంలో మిరపసాగు కొంత ఊరటనిచ్చినా చివరికి అదికూడా కంట తడిపెట్టిస్తోంది. పొలం నిండా దిగుబడి వచ్చినా కోసే దిక్కులేక కళ్లెదుటే నేలపాలు చేసుకోవాల్సి రావడం వల్ల అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. క్వింటాకు ధర రూ.15 వేల వరకు ఉండటంతో వరి, ప్రత్తికి చేసిన అప్పులు తీరి నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. కూలీల కోసం జిల్లాలు దాటి వెతుకుతున్నా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతుల కుటుంబ సభ్యులే అయిన కాడికి కోతలు చేసుకుంటున్నారు. ఎండల తీవ్రతకు తట్టుకోలేక మిరప మొక్కలు తొలగించి చెట్ల నీడన కాయలు కోస్తున్నారు.

పొలాల్లోనే నివాసం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ ఏడాది 68 వేల ఎకరాల్లో అధికంగా మిర్చి సాగు చేశారు. జనవరి చివరి వారం నుంచి దిగుబడులు రాగా.. తొలివిడత కోతలు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలతో కోయించారు. జనవరి నాటికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్​, ఒడిశా ప్రాంతాల నుంచి కూలీలు పెద్దసంఖ్యలో వలస వచ్చారు. 25 వేలకు పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాగా రైతులకు చాలా ఊరటనిచ్చింది. స్థానిక కూలీలతో పనిలేకుండా వసలతోనే పూర్తిగా తొలికోతలు చేయించారు. పొలాల్లోనే నివాసం ఉంచి వారికి ఏర్పాట్లు చేశారు. తొలికోత పూర్తికావడం ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నుంచి మహారాష్ట్రలో కరోనా కేసులు ఉద్ధృతం కావడం వల్ల గత ఏడాది నడిచి వెళ్లిన పరిస్థితులు తలుచుకుంటూ వలసలు తిరుగు పయనమయ్యారు. ఒక్కో ముఠా సదురుకోవడం మార్చి చివరి వారం నాటికి అంతా వెళ్లిపోవడంతో.. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ఒకే కోతతో పూర్తిచేయాలని అలాగే ఉంచడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. మరో వైపు రెండో కోత వచ్చి కోసేవాళ్లు లేక పొలాల్లోనే పంటను ఎండబెడుతున్నారు.

కరోనా ప్రభావం, వర్షాలు

వసల కూలీలతో కిలో కాయలు కోసేందుకు రూ.8 ఖర్చు చేయగా ప్రస్తుతం రూ.20 ఇవ్వాల్సి వస్తోంది. కూలీల కొరతతో రెట్టింపుగా రైతులకు భారం పడింది. అప్పటికీ కూలీలు దొరకక ఊళ్లు పట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రైతులు పొరుగు జిల్లాలైన కృష్ణా, వరంగల్‌ ప్రాంతాలకు వెళ్లి వెతుకుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లోనూ పలు మండలాల్లో అన్వేషిస్తున్నారు. అదనపు కూలీతోపాటు ప్రయాణ ఖర్చులు భరిస్తూ దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. పొలాల్లో ఎండి కాయలు ఎర్రబారి ఉన్న సమయంలో ఈదురు గాలులు, వర్షం పడటంతో చాలా చోట్ల రైతులు ఆశలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం వ్యవసాయంపై మరోసారి తీవ్రంగా పడినట్లయింది.

ఇదీ చూడండి :వచ్చే ఏడాది మేడారం జాతర తేదీలు ఖరారు

ABOUT THE AUTHOR

...view details