ఖమ్మం జిల్లా వైరా రోడ్డులోని జాగృతి ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న భూక్య వెంకటేష్ మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేసే సమయంలో వైద్యులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులను మోహరించారు.