తెలంగాణ

telangana

By

Published : May 21, 2020, 6:59 AM IST

ETV Bharat / state

తిరిగొస్తున్నారు.. కరోనా తెస్తున్నారు

బతుకుదెరువు కోసం సామూహికంగా ఖమ్మం జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారిలోనే కరోనా బాధితులుండటం అధికార యంత్రాంగాన్ని కలవరపెడుతుంది. మరోపక్క ఖమ్మం జిల్లాలో తాజాగా ఇద్దరు పాజిటివ్‌లు మహారాష్ట్రలోని పుణే నుంచి వచ్చిన వారే కావటం గమనార్హం. నిన్న మొన్నటివరకు కేసు ప్రభావం లేకపోవటంతో స్థిమితపడ్డ జిల్లాలో తాజా పరిణామాలు కలకలం రేపుతున్నాయి.

new corona cases are reported in khammam district
ఖమ్మం జిల్లాలో మరోసారి కరోనా కలకలం

మొన్న మహదేవపురం.. నిన్న వీఎం బంజర.. మూలాలు మాత్రం పుణేలోనే.. మూడు రోజుల వ్యవధిలో ఖమ్మం జిల్లాలో రెండో కరోనా కేసు వెలుగుచూసింది. ఈ నెల 13వ తేదీన మహారాష్ట్ర పుణే నగరం నుంచి పెనుబల్లి మండలం వీఎం బంజరకు వచ్చిన ఏడుగురిలో ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధరణ అయ్యింది. సదరు మహిళతోపాటు మరో ఆరుగురు ప్రత్యేక బస్సులో జిల్లాకు వచ్చారు. నిర్ధరణ పరీక్షల్లో ఆ మహిళ భర్తకు మాత్రం నెగిటివ్‌ వచ్చింది.

అటునుంచి వస్తే..

కరోనా ప్రభావంతో అట్టుడికిపోతున్న మహారాష్ట్ర నుంచి జిల్లాకు వచ్చే వారి విషయంలో అధికారులు మరింత అప్రమత్తం కావాల్సిన ఆవశ్యకత ఉంది. జిల్లా సరిహద్దుల్లోనే వారిని గుర్తించి తమ స్వస్థలాలకు కాకుండా ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు చేశాకే పంపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్వస్థలాలకు చేరుకున్నాక గంటల వ్యవధిలోనే తీసుకవస్తున్నా, పరీక్షలు చేస్తున్నా అప్పటికే వారు ఇతరులను కలిసే అవకాశం ఉంటుందన్న ఆందోళన నెలకొంది.

ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వస్తున్నవారి వివరాలు సరిహద్దు చెక్‌పోస్టుల నుంచి అందగానే స్థానిక వైద్య, ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం అవుతున్నారు. లక్షణాలున్నా లేకున్నా వారి కుటుంబాలను క్వారంటైన్‌లో ఉండాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల తామే స్థానికంగా క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు.

సెకండరీ కాంటాక్టు జాబితా

వీఎం బంజర్‌లో కరోనా పాజిటివ్‌ కేసు రావటంతో వైద్య సిబ్బంది బుధవారం రాత్రి రంగంలోకి దిగి సెకండరీ కాంటాక్టు జాబితా తయారీని చేపట్టారు. పాజిటివ్‌ వచ్చిన మహిళ కూతురు అదే ఊరిలో తన బంధువుల ఇంటి వద్దకు వెళ్లడంతో ఆ ఇంట్లో మొత్తం 13 మందికీ హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర వేశారు. అలాగే ఆ పాపను తీసుకెళ్లి, తీసుకొస్తున్న మరో కుటుంబ యాజమాని కుటుంబంలో నలుగురు, వారు కలుసుకున్న నలుగురికి మొత్తం ఎనిమిది మందికీ వైద్య సిబ్బంది హోమ్‌ క్వారంటైన్‌ ముద్ర వేశారు.

వసతి గృహంలో 37 మంది

పుణే నుంచి వచ్చిన ఏడుగురుతో పాటు, వీఎం బంజర్‌లో ఎస్సీ బాలురు వసతి గృహంలో మరో 37 మంది దాకా క్వారంటైన్‌లో ఉన్నారు.

ఐదుగురి నమూనాల సేకరణ

మధిర మండలంల మహదేవపురంలో కరోనా బారినపడ్డ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన అదే గ్రామానికి చెందిన 51 మందిని ఖమ్మం శారదా క్వారెంటైన్‌ కేంద్రానికి తరలించిన విషయం విదితమే.. వీరిలో ఐదుగురికి జ్వరం, దగ్గు లక్షణాలు కన్పించడంతో బుధవారం వారి స్వాబ్‌లను సేకరించి వైరస్‌ నిర్ధారణ కోసం వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలకు పంపించారు. క్వారంటైన్‌ కేంద్రం నుంచి వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.

ABOUT THE AUTHOR

...view details