ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాంతాలన్నింటికి సీతారామ ఎత్తిపోతల ద్వారా నీరిచ్చే విషయమై ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇంజినీర్లతో... మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాఠోడ్ హైదరాబాద్లో సమావేశమయ్యారు. మహబూబాబాద్, ఖమ్మం, ములుగు జిల్లాల్లోని సాగుకు యోగ్యమైన పట్టా భూములన్నింటికీ నీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల ద్వారా ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాలోని సాగుభూమి అంతటికీ నీరిచ్చేలా లక్షా 17వేల ఎకరాల అదనపు ఆయకట్టు కోసం సర్వే చేపట్టనున్నారు. సీతారామ ఎత్తిపోతల కింద 7,70,000 ఎకరాలకు నీరందుతుందని వివరించారు. దీనిలో 6,52,000 ఎకరాలు గతంలోనే ప్రతిపాదించగా మిగిలిన దానికోసం వెంటనే సర్వే చేపడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల మండలాలకు పూర్తి స్థాయిలో సాగునీరందించేలా సర్వే చేసి, డిజైన్ రూపొందించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు. బయ్యారం చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా మార్చాలని, మహబూబాబాబాద్ రైల్వే ట్రాక్ దాటించి సాగునీరు అందకుండా మిగిలిన ప్రాంతానికి కూడా సీతారామ ద్వారా గాని... ఎస్సారెస్పీ ద్వారా సాగునీరు అందేలా చూడాలన్నారు. సమ్మక్క ఆనకట్టకు అటవీ అనుమతులు వచ్చినందున త్వరగా పూర్తి చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ కోరారు.