మనిషి పుట్టేటప్పుడు.. ఒక్కడే పుడుతారు. చనిపోయినా ఒక్కరే వెళ్లిపోతారు. పుట్టినప్పుడు నలుగురు వచ్చి సంతోషాన్ని పంచుకుంటారు. చనిపోతే.. నలుగురు పాడె మోసి.. వల్లకాడికి మోస్తారు. కానీ.. పాడె మోసే మనుషులే లేక.. ఖమ్మం జిల్లాలో ఓ తల్లిని నిరుపేద కొడుకు రిక్షాలో స్మశానానికి తీసుకెళ్లాడు. ఏడ్చి.. ఏడ్చి కన్నీరు ఇంకిపోయిన కళ్లతో.. కుండ పట్టుకొని తల్లికి కొరివి పెట్టడానికి ఒంటరిగా నడిచి వెళ్లాడు.
ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన త్రిపురోజు రాధమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కూతుళ్లిద్దరికీ పెళ్లి చేసింది. తల్లి మరణ వార్త తెలియగానే.. పుట్టెడు శోకంతో ఇద్దరు కూతుళ్లు వరంగల్ నుంచి వచ్చారు. అనారోగ్యం కారణంగా అల్లుళ్లు రాలేదు. నలుగురు మనవళ్లు, ఒక మనవరాళ్లు ఉన్నా.. కరోనా వల్ల అంత్యక్రియలకు రాలేకపోయారు. కూలిపని చేసుకొని కుటుంబాన్ని పోషించే కొడుకు మాధవాచారికి తల్లి అంత్యక్రియలు చేసే స్థోమత కూడా లేదు. సాయం చేసేందుకు బంధువులూ రాలేదు. కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు గ్రామస్థులు, బంధువులు ఎవరూ హాజరు కాలేదు. కనీసం పాడె మోసేందుకు నలుగురు కూడా లేని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.