తెలంగాణ

telangana

హృదయ విదారకం: పాడె మోసేందుకు ఆ నలుగురూ రాలేదు!

By

Published : Jun 15, 2020, 10:25 PM IST

మనిషి చనిపోతే.. కడదాకా మోసేందుకు నలుగురిని  సంపాదించుకోవాలి అనేది పెద్దల మాట. కానీ.. ఆ తల్లికి మాత్రం కడదాక మోసేందుకు ఒక్కరు కూడా రాలేదు. కడుపులో పుట్టిన ఇద్దరు బిడ్డలు ఏడుస్తూ.. తోడు రాగా.. ఒక్కగానొక్క కొడుకు తలకొరివి పెట్టేందుకు ముందు నడిచాడు. అయ్యో పాపం అనిపించే ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

Man Takes Mother Dead body With Rickshaw
పాడె మోసేందుకు నలుగురు కూడా రాలేదు.. రిక్షా మీద స్మశానానికి!

మనిషి పుట్టేటప్పుడు.. ఒక్కడే పుడుతారు. చనిపోయినా ఒక్కరే వెళ్లిపోతారు. పుట్టినప్పుడు నలుగురు వచ్చి సంతోషాన్ని పంచుకుంటారు. చనిపోతే.. నలుగురు పాడె మోసి.. వల్లకాడికి మోస్తారు. కానీ.. పాడె మోసే మనుషులే లేక.. ఖమ్మం జిల్లాలో ఓ తల్లిని నిరుపేద కొడుకు రిక్షాలో స్మశానానికి తీసుకెళ్లాడు. ఏడ్చి.. ఏడ్చి కన్నీరు ఇంకిపోయిన కళ్లతో.. కుండ పట్టుకొని తల్లికి కొరివి పెట్టడానికి ఒంటరిగా నడిచి వెళ్లాడు.

ఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన త్రిపురోజు రాధమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. కూతుళ్లిద్దరికీ పెళ్లి చేసింది. తల్లి మరణ వార్త తెలియగానే.. పుట్టెడు శోకంతో ఇద్దరు కూతుళ్లు వరంగల్​ నుంచి వచ్చారు. అనారోగ్యం కారణంగా అల్లుళ్లు రాలేదు. నలుగురు మనవళ్లు, ఒక మనవరాళ్లు ఉన్నా.. కరోనా వల్ల అంత్యక్రియలకు రాలేకపోయారు. కూలిపని చేసుకొని కుటుంబాన్ని పోషించే కొడుకు మాధవాచారికి తల్లి అంత్యక్రియలు చేసే స్థోమత కూడా లేదు. సాయం చేసేందుకు బంధువులూ రాలేదు. కరోనా నేపథ్యంలో అంత్యక్రియలకు గ్రామస్థులు, బంధువులు ఎవరూ హాజరు కాలేదు. కనీసం పాడె మోసేందుకు నలుగురు కూడా లేని పరిస్థితి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.

అప్పటికప్పుడు ఓ రిక్షా తెప్పించి దాని మీద తల్లి మృతదేహాన్ని పెట్టి ముందు నడుస్తూ.. ఇద్దరు సోదరులు ఏడుస్తూ తోడు రాగా స్మశానానికి తీసుకెళ్లాడు. మాధవాచారికి.. ఊరంతా పరిచయమే. స్నేహితులు, బంధువులు చాలామంది ఉన్నారు. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ చావుకు రాలేకపోయారు. చస్తే.. పాడే మోసేందుకు నలుగురైనా ఉంటారన్న సామెతకు అర్థం కరోనా మార్చేసింది. అసలే.. లాక్​డౌన్​ ఉపాధి సరిగ్గా లేదు. చేతిలో డబ్బులు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో మాధవాచారి తల్లి మృతదేహంతో ఒంటరిగా అంత్యక్రియలకు వెళ్తున్న దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది.

ఇదీ చదవండి:ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

ABOUT THE AUTHOR

...view details