ఖమ్మం జిల్లాలో కేటీఆర్ విస్తృత పర్యటన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు రూ.423 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. కేటీఆర్తోపాటు రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొననున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ మైదానం నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా కేటీఆర్ పర్యటనకు బయలుదేరుతారు.
ఐటీ హబ్ రెండో దశకు అంకురార్పణ..
తొలుత రూ.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐటీ హబ్ రెండో దశకు అంకురార్పణ చేయనున్నారు. అనంతరం సీసీరోడ్లతో పాటు శ్రీశ్రీ సర్కిల్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు నిర్మించనున్న నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత టేకులపల్లిలో రెండు పడకల గదుల ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. నగరపాలక సంస్థ పరిధిలోని 35 వేల నూతన కనెక్షన్లు, 85 వేల పాత కనెక్షన్లకు మంచినీటి సరఫరాను ప్రారంభిస్తారు.
మరో మణిహారం..
ఖమ్మం జిల్లాకు మణిహారంగా నిలిచిన నూతన బస్టాండ్.. కేటీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన బస్టాండ్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఇందులో 30 ప్లాట్ ఫాంలు ఉండగా.. ఒకేసారి 30 బస్సు సర్వీసులు నిలిచే సదుపాయం ఏర్పాటు చేశారు. మరో 30 బస్సులు నిరీక్షించే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రయాణ ప్రాంగణం ప్రారంభం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పాల్గొంటారు. అనంతరం కాల్వొడ్డులోని నూతన వైకుంఠధామాన్ని ప్రారంభించి.. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి కేటీఆర్ హాజరవుతారు.
సత్తుపల్లిలో..
పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమం ముగిసిన అనంతరం హెలికాప్టర్లో సత్తుపల్లికి చేరుకుంటారు. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన నూతన పురపాలక భవనం ప్రారంభిస్తారు. అనంతరం రూ.2 కోట్లతో చేపట్టనున్న సమీకృత మార్కెట్కు శంకుస్థాపన చేస్తారు. ఇలా ఒకే రోజు దాదాపు రూ.423 కోట్ల 23 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొంటారు. కేటీఆర్ పర్యటన దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తెరాస జెండాలు, మంత్రుల ఫ్లెక్సీలతో విస్తృత ఏర్పాట్లు చేశారు.
ఇవీచూడండి:'మరో ఆర్నెళ్లలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి'