ఒకప్పుడు దేశంలోనే అత్యంత గిరాకీ ఉన్న గ్రానైట్ను అందించిన ఖమ్మం జిల్లా పరిశ్రమల్లో ఇప్పుడు నిశబద్ధం రాజ్యమేలుతోంది. ఆగిపోయిన ఎగుమతులు, కనిపించని కార్మికులతో పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది.
రాష్ట్రంలోనే కరీనంగర్, వరంగల్ జిల్లాలతోపాటు గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లాల్లో ఖమ్మం ఒకటి. జిల్లాలో మొత్తం 500 గ్రానైట్ పరిశ్రమలున్నాయి. వీటిలో 60 నుంచి 70వరకు పలు కారణాలతో మూతబడ్డాయి. 10టైల్స్ ఎగుమతి యూనిట్లు ఉన్నాయి. విదేశాలకు రా.. మెటీరియల్ కూడా ఎగుమతి అవుతుంది.
ఒక్కసారిగా నేలకొరిగింది
ఈ పరిశ్రమల ద్వారా ఏడాదికి దాదాపు 500 కోట్ల టర్నోవర్ గ్రానైట్ వ్యాపారం సాగిస్తుంటారు. రా.. మెటీరియల్ ఎగుమతుల వ్యాపారం మరో 500 కోట్ల వరకు ఉంటుంది. ఇలా ఏటా దాదాపు వెయ్యి కోట్ల టర్నోవర్తో విరాజిల్లుతున్న ఖమ్మం గ్రానైట్ పరిశ్రమల్ని... కరోనా కుదుపు ఒక్కసారిగా నేలచూపులు చూసేలా చేసింది.
60 రోజులు.. రూ.300 కోట్ల నష్టం
అరుదైన బ్లాక్ గ్రానైట్ తయారీకి నిలయంగా ఉన్న ఖమ్మం జిల్లా పరిశ్రమల నుంచి చైనా, దుబాయ్, యూకే, వియత్నాం వంటి దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. లాక్డౌన్ వల్ల ఎగుమతులన్నీ ఆగిపోయి, అక్కణ్నుంచి రావాల్సిన బకాయిలు అందక పీకలోతు కష్టాల్లో చిక్కుకున్నాయి. 60 రోజుల్లోనే రూ.300 కోట్ల నష్టాలు మూట గట్టుకున్నాయి.
కార్మికుల్లేరు.. ఎగుమతుల్లేవు
పరిశ్రమనే నమ్ముకుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది కుటుంబాలు లాక్డౌన్తో ఉపాధి లేక ఇంటి బాట పట్టాయి. నిబంధనలు సడలించి పరిశ్రమ తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినా.. కార్మికులు లేక ఇప్పుడు పరిశ్రమ తెరుచుకునే వీలు లేకుండా పోయింది.
ఆదుకోవాలి
పీకలోతు కష్టాల్లో ఉన్న గ్రానైట్ పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటేనే మళ్లీ నిలబడగలుగుతాయని గ్రానైట్ వ్యాపారులు అంటున్నారు. పరిశ్రమ నిలదొక్కుకోవాలంటే... ఫిక్స్డ్ ఛార్జీలను రద్దు చేయాలని, రెండేళ్ల పాటు మైనింగ్ రాయల్టీ ఎత్తివేయాలని కోరుతున్నారు. సుమారు 6 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సబ్సిడీలను విడుదల చేయాలని, 4 నెలల పాటు కరెంటు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.