వృద్ధాప్యంలో ఎవరూ లేక పార్టీ స్తూపం కింద తలదాచుకున్న ఓ వృద్ధుడిని అక్కున చేర్చుకునేందుకు దాతలు ముందుకు వచ్చారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం ఆరికాయలపాడులో పార్టీ స్తూపం కింద అచేతన స్థితిలో ఉన్న వీరారెడ్డి అనే అభాగ్యుడి ధీన పరిస్థితిపై 'ఈటీవీ భారత్- ఈనాడు' కథనం ప్రసారం అయింది. కథనానికి స్పందించిన దాతలు.. వీరారెడ్డిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.
కథనానికి స్పందించి
ఆరికాయలపాడు కూడలిలో పార్టీ స్తూపానికి ఉన్న పిల్లర్ల నడుమ మంచం వేసుకుని అదే నివాసంగా మలుచుకున్నాడు వీరారెడ్డి. కొద్ది ఎత్తులో ఉన్న ఆ గూటిలోకి వెళ్లలేక అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. కర్ర ఊతంతో అడుగులో అడుగు వేస్తూ యాచిస్తూ ఆహారం సమకూర్చుకున్నాడు. అతడి ధీన పరిస్థితిని 'ఈటీవీ భారత్- ఈనాడు' ప్రచురితం చేసింది. స్పందించిన దాతలు తామంటే తామంటూ ఆశ్రమాలకు తీసుకెళ్లేందుకు ముందుకు వచ్చారు. చివరకు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు.. తన అంబులెన్స్లో ఆశ్రమానికి తీసుకెళ్లారు.