తెలంగాణ

telangana

ETV Bharat / state

పత్తి రంగు మారింది.. రైతు మొహం వాడింది... - cotton farmers lost in khammam district

సీజన్ ఆరంభంలో కరుణచూపని వరుణుడు. నాటిన విత్తనం మొలకెత్తక ఒకటికి, మూడుసార్లు నాటిన పత్తి విత్తనాలు, పంటను కాపాడుకునేందుకు భారీగా పెట్టిన పెట్టుబడులు, తీరా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలతో పూర్తిగా తగ్గిన దిగుబడి.. ఉన్న కొద్దిపాటి పంట రంగుమారిన వైనం. ఇది ఆది నుంచి కష్టాల కడలి మధ్య పత్తి సాగు చేసిన ఖమ్మం జిల్లా కర్షకలోకం పరిస్థితి. కోటి ఆశలతో మార్కెట్​కు వస్తే... కనీసం పెట్టుబడులు కూడా తీరని ధరలు వారిని వేదనకు గురిచేస్తున్నాయి.

అన్నదాతలకు కష్టాలు

By

Published : Nov 13, 2019, 6:14 AM IST

ఖమ్మం అన్నదాతలకు కష్టాలు

పత్తి కొనుగోళ్ల సీజన్ ఆరంభంతోనే అన్నదాతలకు కష్టాలు కూడా మొదలయ్యాయి. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద పత్తి మార్కెట్​గా ఖ్యాతిగాంచిన ఖమ్మం మార్కెట్​కు అక్టోబర్ చివరి వారం నుంచి పత్తి రాక మొదలైంది. రోజుకు దాదాపు 10 వేల బస్తాల వరకు రైతులు మార్కెట్​కు తీసుకొస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల నుంచి పత్తి ఖమ్మం మార్కెట్​కు వస్తోంది. ప్రధాన వాణిజ్య పంటగా ఉన్న పత్తికి ఆ స్థాయిలో ధరలు లేకపోవడం రైతుల్ని తీవ్రంగా కుంగదీస్తోంది.

ఎకరానికి రూ.10 వేలు కూడా రాలే..

గతేడాది సీజన్ ఆరంభంలో క్వింటాకు రూ. 7,500 వరకు పలికితే.. ప్రస్తుతం ఖమ్మం మార్కెట్​లో గరిష్ఠంగా రూ.5,000 కూడా పలకకపోవడం మార్కెట్​కు వస్తున్న అన్నదాతల్లో తీవ్ర కలవరం రేపుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి, కొణిజర్ల, చింతకాని, రఘునాథపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం, మధిర, ముదిగొండ మండలాల్లో ఈ పంట సాగు చేశారు. ఈసారి దిగుబడి కూడా ఆశాజనకంగానే వస్తుందని ఆశించారు. దాదాపు 20 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడులు వస్తాయని అంచనా వేశారు. ఒక ఎకరం పత్తి సాగుకు రైతులు రూ.32,000 వరకు ఖర్చు చేస్తే ఎకరానికి రూ. 10వేలు కూడా రాలేదని వాపోతున్నారు.

తీవ్ర నైరాశ్యం..

ఇటీవల కురిసిన వర్షాలకు తోడు, రైతులు తెస్తున్న పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. నాణ్యమైన కొత్త పత్తిని క్వింటా రూ. 4,500 వరకు కొనుగోలు చేస్తున్నారు. అధిక శాతం గుడ్డి పత్తి, తడిసిన పత్తికి రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకే ఇస్తున్నారు వ్యాపారులు.

కూలీల ఖర్చులకు కూడా..

ప్రస్తుతం మార్కెట్​లో దక్కుతున్న ధరలతో.... కనీసం కూలీల ఖర్చులు కూడా సరిపోవని రైతులు వాపోతున్నారు. గతేడాది రూ. 150 కూలీ రేటు ఉంటే.. ఈసారి రూ. 250 చెల్లించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రారంభించిన సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనూ.. అనేక కొర్రీలు పెడుతుండటం వల్ల రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఇదీ చూడండి: వీరు ఆరోపణలు చేస్తుంటే.. వారు ఆదర్శమంటున్నారు: భట్టి

ABOUT THE AUTHOR

...view details