తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2023, 8:55 PM IST

ETV Bharat / state

వడగళ్ల వానకు పంటలు అతలాకుతలం.. కోట్లలో పెట్టుబడి వర్షార్పణం

Crops Damaged Due to Hail Rains in Telangana : రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కర్షకులను నట్టేట ముంచాయి. ఆరుగాలం శ్రమించి పంటను అమ్ముకుందామనే సమయానికి వడగళ్లు, ఈదురుగాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. పంట పరిహారంతో పాటు వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి, మిర్చిని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని బాధిత అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ యంత్రాంగం తాత్సారం చేయకుండా... త్వరగా నష్టం అంచనా వేసి కేంద్రం నుంచి పరిహారం అందేలా చూడాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Crops Damaged
Crops Damaged

వడగళ్ల వానకు పంటలు అతలాకుతలం.. లక్షలాది రూపాయల పెట్టుబడి వర్షార్పణం

Crops Damaged Due to Hail Rains in Telangana : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు రైతులకు దిగాలు మిగిల్చాయి. లక్షల్లో పెట్టుబడులు పెట్టి వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశామని చివరికి గిట్టుబాటు ధర సైతం దక్కేలా లేదని ఆవేదన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అకాల వర్షాలకు పంటలు నేలవాలాయి. వడగళ్ల బీభత్సానికి కొమరారం, మసివాగు గ్రామాల్లో మొక్కజొన్న చేతికందే పరిస్థితి లేకుండా పోయింది. కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి తడిసి రైతుకు కన్నీరే మిగిల్చింది. మొక్కజొన్న, పెసర, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

రైతులకు కేసీఆర్‌ సర్కార్‌ కడగండ్లను మిగిల్చుతోంది : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మర్రిగూడెం పంచాయతీలో రైతుల రోదన ఆకాశన్నంటింది. వడగళ్ల ధాటికి పంట మెుత్తం నష్టపోయామని దిగాలు చెందుతున్నారు. రామ్మూర్తి అనే రైతు అకాల వర్షంతో దెబ్బతిన్న తన మొక్కజొన్న పంట చూసి ఆవేదనతో... పాట రూపంలో తన బాధను వ్యక్తం చేశాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో సుంకిని పోతంగల్‌లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. మామిడి, మొక్కజొన్న, మిర్చి, పసుపు తదితర పంటల నష్టాన్ని వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ అధికారులు సర్వేచేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. కేంద్రం నుంచి త్వరితగతిన పరిహారం అందేలా చూడాలి రేవంత్ డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని నీరుగార్చి రైతులకు కేసీఆర్‌ సర్కార్‌ కడగండ్లను మిగిల్చుతోందని ఆరోపించారు.

లక్షలాది రూపాయల పెట్టుబడి వర్షార్పణం : కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో అకాల వర్షాలు, వడగళ్ల వాన ధాటికి రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల్లోని మామిడి, మొక్కజొన్న, మిరప పంటలు చేతికి అందకుండా పోయాయని వాపోయారు. మామిడి నేలరాలి మార్కెట్లో మద్దతు ధర లభించని దుస్థితి నెలకొందని ఆవేదన చెందారు. లక్షలాది రూపాయల పెట్టుబడి వర్షార్పణమైందని...కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలని కోరారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అకాలవర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీశాయి. పంట సర్వం కోల్పోయి... రైతులు దిక్కుతోచని పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. మరో పదిహేను ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తుందనుకున్న పరిస్థితిలో... మొక్కజొన్న ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details