తెలంగాణ

telangana

By

Published : Mar 30, 2022, 6:59 AM IST

ETV Bharat / state

Pranahitha Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లేవీ?

Pranahitha Pushkaralu: తెలంగాణలో పుట్టి గోదావరిలో సంగమించే నది ప్రాణహితకు పుష్కరాలు దగ్గర పడుతున్నా ఏర్పాట్లేవీ మొదలుకాకపోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. ముహూర్తం దగ్గర పడుతున్నా.. స్నానాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు, నిర్వహణపై ఒక్కడుగూ ముందుకు పడకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pranahitha Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లేవీ?
Pranahitha Pushkaralu: ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లేవీ?

Pranahitha Pushkaralu: కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా తుమ్మడిహెట్టి వద్ద గత పుష్కరాలకు ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌ శిథిలావస్థకు చేరింది. కౌటాల మండల కేంద్రం నుంచి తుమ్మడిహెట్టికి వెళ్లే దారి గుంతలమయంగా మారింది. గ్రామం నుంచి నదీ తీరం వరకు కూడా రహదారి నిర్మించాలి.

తెలంగాణలో పుట్టి గోదావరిలో సంగమించే నది ప్రాణహితకు పుష్కరాలు దగ్గర పడుతున్నా ఏర్పాట్లేవీ మొదలుకాకపోవడం భక్తులకు ఆందోళన కలిగిస్తోంది. వచ్చేనెల 13 నుంచి 24 వరకు ఈ నదికి పుష్కరాలు జరగనున్నాయి. ముహూర్తం దగ్గర పడుతున్నా.. స్నానాలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు, నిర్వహణపై ఒక్కడుగూ ముందుకు పడలేదు. 2010లో జరిగిన పుష్కరాల్లో రోజుకు 50 వేల నుంచి లక్షమంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. అప్పట్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇప్పుడు మెరుగయ్యాయి. మంచిర్యాల జిల్లా పరిధిలోని అర్జునగుట్ట-సిరోంచా (మహారాష్ట్ర) మధ్య ప్రాణహిత నదిపై, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం-సిరోంచా మధ్య గోదావరి నదిపై వంతెనలు నిర్మించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వంతెనలు ఏర్పాటు చేయడంతో రవాణా మెరుగైంది. దీంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

చేయాల్సిన మరిన్ని ఏర్పాట్లు..

  • గత పుష్కరాల సమయంలో అర్జునగుట్ట-సిరోంచ వద్ద రేవు ఉండేది. ఈ రేవుకు సమీపంలోని రాపన్‌పల్లి వద్ద ప్రాణహిత నదిపై వంతెన నిర్మించారు. ఇప్పుడా వంతెనకు ఇరువైపులా కొత్తగా రెండు స్నానఘట్టాలు, దేవులవాడ సమీపంలో వీఐపీ పుష్కరఘాట్‌ను ప్రతిపాదించారు.
  • వేమనపల్లి వద్ద కూడా పుష్కరఘాట్‌ ప్రతిపాదించారు. కోటపల్లి మండలంలోని ఆల్గాం, పుల్లగామ, సిర్సా, వెంచపల్లి తదితర గ్రామాలకు నదీతీరం వరకు మట్టి రోడ్లు ప్రతిపాదించారు. ఇక్కడా తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
  • గోదావరి తీరంలో, కాళేశ్వరం ఆలయంలో భారీగా చలువ పందిళ్లు వేయాలి, విద్యుత్తు దీపాలు పెట్టాలి. తాత్కాలిక మరుగుదొడ్లు, ఆలయం వద్ద క్యూ లైన్‌ నిర్మాణాలు చేయాల్సి ఉంటుంది.
  • ప్రముఖుల ఘాట్‌ వద్ద మెట్లను విస్తరించాలని ప్రతిపాదించారు. తాగునీరు, సీసీ కెమెరాలు, జల్లు స్నానాలకు షవర్లు తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

పుష్కరాలకు ప్రతిపాదనలు...

మూడు జిల్లాల నుంచి దాదాపు రూ.80 కోట్ల వరకు ప్రతిపాదనలు పంపారు. ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సమన్‌ నిధులు కేటాయించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికీ స్పష్టత రాలేదు.

ప్రతిపాదిత స్నానఘట్టాలు..

  • కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కౌటాల మండలం తుమ్మడిహెట్టి
  • మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి మండల కేంద్రంలో, కోటపల్లి మండలంలో అర్జునగుట్ట వద్ద, రాపన్‌పల్లి, దేవులవాడ సమీపంలోని అంతర్రాష్ట్ర వంతెనకు ఇరువైపులా ఒక్కొక్కటి, దేవులవాడ సమీపంలోని పంప్‌హౌస్‌ (ఎస్టీపీపీ) సమీపంలో ఓ వీఐపీ స్నానఘట్టం
  • జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం త్రివేణి సంగమం.

వివరాలు సంక్షిప్తంగా..

  • ప్రాణహిత నది జన్మస్థానం: తుమ్మడిహెట్టి (కౌటాల మండలం, కుమురంభీం జిల్లా)
  • గోదావరికి ఉపనది ప్రాణహిత
  • పెన్‌గంగా, వార్ధా నదుల కలయికతో తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహితగా మారుతుంది
  • నది పొడవు.. 113 కిలోమీటర్లు
  • కుమురంభీం, మంచిర్యాల జిల్లాల మీదుగా వచ్చి కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తుంది
  • పుష్కరాల్లో రోజుకు లక్ష నుంచి 2 లక్షల మందికి పైగా స్నానాలు ఆచరిస్తారని అంచనా

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details