తెలంగాణ

telangana

ETV Bharat / state

'విత్తన ఎంపికే బలం.. జాగరూకత తప్పనిసరి'

సాగుకు మూలాధారం విత్తనమే. సాగు బండి సాఫీగా సాగాలంటే విత్తన ఎంపిక అన్నదాత ముందున్న సవాల్. మార్కెట్​లోకి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న విత్తన కంపెనీలు ఓ వైపు.. తక్కువ ధర చూపి రైతులకు అంటగట్టే వ్యాపారులు మరోవైపు.. ఇవి చాలవన్నట్లు నకిలీ, నాసిరకం విత్తన విక్రయాలు మార్కెట్​లో జోరుగా సాగుతున్నాయి. అన్నదాతల మదిని తొలిచే ప్రశ్నలు ఎన్నో మరెన్నో. అందుకే విత్తన ఎంపికతోనే రైతుల పంటల దిగుబడి 50 శాతానికి పైగా ఉంటుందని అంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు.

By

Published : Jul 2, 2020, 11:14 PM IST

విత్తన ఎంపికే బలం..జాగరూకతత తప్పనిసరి: వ్యవసాయ శాస్త్రవేత్తలు
విత్తన ఎంపికే బలం..జాగరూకతత తప్పనిసరి: వ్యవసాయ శాస్త్రవేత్తలు

కోటి ఆశలతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్న రైతాంగం ఏ విత్తనం మంచిది ఏ విత్తనం నాణ్యంగా ఉంటుంది. ఏ సమయంలో విత్తనం వేసుకోవాలి. వేసుకున్న విత్తనం మొలకెత్తేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ, నాసిరకం విత్తనాలు ధరిచేరకుండా ఎలాంటి అప్రమత్తతతో ఉండాలన్న అంశాలను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త హేమంత్ కుమార్​తో ఈనాడు - ఈటీవీ భారత్ ముఖాముఖి.

1. ప్రస్తుతం సీజన్ ఎలా ఉంది. ఉమ్మడి జిల్లాలో కావాల్సిన వర్షపాతం నమోదైందా ?

జ. హేమంత్ కుమార్ : ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో రైతులు వానాకాలం సాగుకు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లాలో వర్షపాతం జూన్​లో 105 ఎంఎం పడాల్సి ఉండగా 185 ఎంఎం నమోదైంది. 70 నుంచి 75 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం పత్తి, పెసర పంటలకు అనుకూలంగా ఉంటుంది. రైతులు అన్ని పంటలకు విత్తనాలు వేసుకోవచ్చు. ఈ సీజన్​లో విస్తీర్ణం 5.18లక్షల ఎకరాలు ఉండగా.. ఇప్పటి వరకు 1.2 లక్షల ఎకరాల్లో సాగు మొదలుపెట్టారు. మెట్ట పంటల సాగుకు ఇంకా చాలా సమయం ఉంది.

2. జిల్లాలో నమోదైన వర్షపాతంతో ఏయే పంటలకు విత్తనాలు వేసుకోవచ్చు. ఏయే పంటల విత్తనాలు వేయకూడదు ?

జ. హేమంత్ కుమార్ : జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటలు నాలుగు ఉన్నాయి. 2.3 లక్షల ఎకరాల్లో వరి, 2.43 లక్షల ఎకరాల్లో పత్తి, 20 వేల హెక్టార్లలో మిర్చి సాగు చేసే వీలుంది. ఈ సమయంలో వర్షాధారంగా సాగుచేసే పంటలు మొదలు పెట్టవచ్చు. పత్తి జూలై 20 వరకు విత్తుకోవచ్చు. జూలై 15 వరకు పెసర సైతం విత్తుకోవచ్చు. ఆగస్టు మాసం వరకూ కంది విత్తనాలు కూడా వేసుకోవచ్చు. జూలై 15 వరకు వరి మధ్యకాలిక 130, 135 రకాలు రోజులవి ఎంచుకోవాలి. ప్రాజెక్టుల కింద నీటి రాక ఆలస్యమయ్యే వారు 120, 125 రకాలను ఎంచుకోవాలి. మిర్చికి ఇంకా సమయం ఉంది. జూలై మధ్య నుంచి కానీ ఆఖరు నుంచి నార్లు పోసుకుని ఆగస్టులో నాట్లు వేసుకోవాలి. రైతులు తొందరపడకుండా పూర్తిస్థాయిలో భూములు చదును చేసుకున్న తర్వాతే విత్తనాలు వేసుకోవాలి.

3. విత్తనమే సాగుకు మూలాధారం. మరి విత్తన ఎంపికలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?

జ. హేమంత్ కుమార్ : విత్తన ఎంపిక చేసుకోవడం ముఖ్యమైన అంశం. విత్తనం బాగుంటేనే పంట బాగుంటుంది. అధిక దిగుబడులు వస్తాయి. అత్యధిక విస్తీర్ణంలో పత్తి సాగవుతుంది కనుక రైతులు మరింత జాగ్రత్తగా విత్తనం ఎంపిక చేసుకోవాలి. ఏ హైబ్రిడ్స్ తో అధిక దిగుబడులు సాధించారో అలాంటి వాటినే ఎంచుకోవాలి. వర్షాధారంగా సాగు చేసే రైతులు సన్నరకాలు, నీటి పారుదల అవకాశం ఉన్న రైతులు లావు రకాలు ఎంచుకోవాలి. ఎండు తెగులును తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. WRG-65 రకం, ICPL-87119, మారుతి-8863 రకాలను ఎంచుకుంటే బాగుంటుంది. పెసరలో పల్ల ఆకు తెగులును తట్టుకునే విత్తనాలు ఎంచుకోవాలి.

5. విత్తనం విత్తిన తర్వాత మొలకెత్తే దశలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని ఎలా అధిగమించాలి ?

జ. హేమంత్ కుమార్ : భూమికి అనుకూలమైన పంటలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎంపిక చేసుకున్న పంటపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులను సంప్రదించాలి. వేసే పంట

భూమికి సరిపోతుందా లేదా అన్న అంశంపై నిపుణుల సలహాలు తీసుకోవాలి. కొన్న విత్తనాలకు కచ్చితంగా బిల్లులు తీసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవాలి.

6.విత్తనాల ఎంపికలో గత అనుభవాలు రైతులను ఆందోళనగు గురిచేస్తున్నాయి. నకిలీ, నాసిరకం విత్తనాలు ఎలా గుర్తించాలి..?

జ: హేమంత్ కుమార్: విత్తన ఎంపిక జాగ్రత్తగా చేయాలి. అధీకృత డీలర్లు, లైసెన్సు ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. తక్కువ ధరలకు ఆశపడి విత్తనం కొనుగోలు చేయవద్దు. పరిశోధన స్థానాల్లో విత్తనాలు ఎంచుకుంటే ఇబ్బందులు ఉండవు.

7. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నియంత్రిత విధానంతో పంటల సాగు విస్తీర్ణంలో మార్పు కనిపిస్తుంది. గతంలో వేసిన పంటలను ఈసారి వేసే పరిస్థితి లేదు కదా...మరి పంట మార్పిడిలో రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

జ: హేమంత్ కుమార్: నియంత్రిత సాగు విధానంలో ఈ సారి పత్తి, మిర్చి సాగు పెరిగే అవకాశం ఉంది. మొక్కజొన్న స్థానంలో పత్తి ఎక్కువ సాగు చేసే అవకాశం ఉంది. మరికొంత మంది రైతులు కంది వైపు వెళ్తారు. ఈ సీజన్ లో మొక్కజొన్న సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదు. రైతులకు గిట్టుబాటు కాదు. అపరాల వైపు వెళ్లి పంట మార్పిడి చేపడితే బాగుంటుంది. అపరాల సాగుతో భూములకు సత్తువ కూడా పెరుగుతుంది.

8. కోటి ఆశలతో సాగుకు సమాయత్తమవుతున్న రైతాంగం సాగు బండి సాఫీగా సాగేందుకు మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి?

జ : హేమంత్ కుమార్: ఈ సారి రుతుపవనాలు ఆశించిన మేర ఉన్నాయి. కావాల్సిన వర్షపాతం కంటే కూడా ఎక్కువ నమోదైంది. నీటి వనరుల ఆధారంగా కానీ... వర్షాల ఆధారంగా కానీ పంటలు సాగు చేసుకుంటే రైతుల సాగు సాఫీగా సాగుతుంది. అదును పదును చూసి సాగు చేస్తే అధిక దిగుబడులు, లాభాలు వచ్చే అవకాశం ఉంది.

విత్తన ఎంపికే బలం..జాగరూకతత తప్పనిసరి: వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఇవీ చూడండి : కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్

ABOUT THE AUTHOR

...view details