తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2021, 3:42 PM IST

ETV Bharat / state

HELPING: రోజూ నాన్​వెజ్​తో కొవిడ్​ బాధితులకు భోజనం

కరోనా సమయంలో లాక్​డౌన్​ విధించి... ఆన్​లైన్​లోనే విద్యార్థులకు తరగతులు చెప్తున్నారు. అలా ఫోన్​లలో తరగతులకు హాజరవుతున్న మనవడిని చూసి... అతని నానమ్మ ల్యాప్​టాప్​, ఇతర అవసరమైన వస్తువులు కొనుక్కొవాలని లక్షరూపాయలు ఇచ్చింది. ఆ పైసలు తీసుకున్న మనవడు మాత్రం ల్యాప్​టాప్​ కొనుక్కోలేదు. మరి ఆ డబ్బంతా ఆ పిల్లవాడు ఏం చేశాడు అనుకుంటున్నారా? అతను ఏ దుబారా ఖర్చులు చేయలేదు. అందరూ మెచ్చుకునే పని చేసి... శభాష్ అనిపించుకున్నాడు.

HELPING
కొవిడ్​ బాధితులకు భోజనం

ఖమ్మం నగరానికి చెందిన కృష్ణ ఏఆర్​ కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య పేరు రాజేశ్వరి. వారి కుమారుడు లోహిత్​. కరోనా సమయంలో విధులకు వెళ్లిన కృష్ణ... అక్కడ కొవిడ్​ రోగులు పడుతున్న ఇబ్బందులు చూసి చలించిపోయేవారు. ఇంటికి వచ్చాక ఆయన చూసిన విషయాలు కుటుంబసభ్యులకు చెప్పేవారు. సొంత వాళ్లే కొవిడ్​ రోగులను అనాథలుగా వదిలేస్తున్నారని... కనీసం వారికి సరైన భోజనం దొరకట్లేదని నిత్యం బాధపడేవారు.

అలా కరోనా బాధితులు పడుతున్న బాధలను తెలుసుకున్న లోహిత్ వారికి ఎలా అయినా సహాయం చేయాలనుకున్నాడు. వారికి మనం ఏమి సాయం చేయలేమా అంటూ తండ్రిని ప్రశ్నించాడు. అప్పుడే లోహిత్​కు ఒక ఆలోచన వచ్చింది. ల్యాప్​టాప్​ కొనుక్కోమని... తన నానమ్మ ఇచ్చిన లక్ష రూపాయలతో కొవిడ్​ బాధితులకు భోజనం పెడతాను అంటూ తండ్రికి చెప్పాడు. తరువాత కుటుంబసభ్యులందరిని ఒప్పించాడు.

నానమ్మ నాకు ఆన్​లైన్​ ​క్లాస్​లకు ఇబ్బంది లేకుండా ల్యాప్​టాప్​ కొనుక్కొమని లక్ష రూపాయలు ఇచ్చింది. వాటితో కరోనా బాధితులకు రోజూ నాన్​వెజ్​ భోజనం ఇస్తున్నాం. ఇంట్లోనే కుటుంబసభ్యుల సహాయంతో తయారు చేసి... ఆస్పత్రి వద్దకు తీసుకెళ్తాం. మేము చేస్తున్న సేవలు మెచ్చి దాతలు ముందుకు వచ్చారు. వారి సహకారంతో నెలరోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.

-లోహిత్​

ఇంటి వద్దనే భోజనం తయారు చేసి.. వాటిని ప్యాకింగ్​ చేసి కొవిడ్​ ఆస్పత్రులలో రోగులకు అందిస్తున్నారు. రోజూ చికెన్ లేదా గుడ్డుతో కర్రీ చేస్తున్నామని లోహిత్ తెలిపాడు. రోజుకు 150 మందికి ఆహారం ప్యాకెట్లు సిద్ధం చేయడం, పండ్లు, వాటర్​బాటిళ్లు ఇస్తున్నామని వెల్లడించాడు.

కొవిడ్​ రోగులు పడుతున్న ఇబ్బందులు చూసి... లోహిత్​ తన దగ్గరున్న లక్ష రూపాయలు ఇచ్చాడు. తన చిన్న వయసులో పెద్ద మనసుకు మేము కూడా తోడవ్వాలనుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. మా డిపార్ట్​మెంట్​లో పని చేసే పోలీసు అధికారులు, జిల్లా అధికారులు కూడా మాకు తోడుగా ముందుకు వచ్చారు.

-కృష్ణ, లోహిత్​ తండ్రి

బాధితులకే కాకుండా.. ఆస్పత్రి వద్ద ఉంటున్న వారి కుటుంబసభ్యులకు సైతం భోజనం అందిస్తున్నామని లోహిత్​ కుటుంబసభ్యులు తెలిపారు. కష్టకాలంలో తనవంతు సాయంగా సేవ చేశామని... భవిష్యత్​లోనూ దాతల సాయంతో సేవలు కొనసాగిస్తామని లోహిత్ తెలిపాడు.

కొవిడ్​ బాధితులకు భోజనం

ఇదీ చూడండి:సైకిల్​పై ఫుడ్​ డెలివరీ.. దాతల సాయంతో కొత్త బైక్..

SURABHI: సురభి కళాకారుల కథనానికి స్పందన.. దాతల చేయూత..!

ABOUT THE AUTHOR

...view details