తెలంగాణ

telangana

ETV Bharat / state

భద్రాద్రిలో నిరాడంబరంగా రాములోరి ఎదుర్కోలు ఉత్సవం - Edurukolu festival news

చూడచక్కని వాడు... ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరఫు పురోహితులు కీర్తించగా... సుగుణాల రాశి సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్ఠలని సీతమ్మ తల్లి తరఫు అర్చకులు కీర్తిస్తూ సాగిన ఎదుర్కోలు మహోత్సవం ఆద్యంతం ఆకట్టుకుంది. సీతారాముల కీర్తి ప్రతిష్ఠల్ని, వంశ విశిష్టతను కీర్తిస్తూ సాగిన కమనీయ వేడుక వైభవోపేతంగా సాగింది. కరోనా ప్రభావంతో ఈసారి కూడా అత్యంత నిరాడంబరంగా భద్రాద్రి దివ్యక్షేత్రంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం లేనప్పటికీ ప్రత్యక్ష ప్రసారాల్లో చూసిన భక్తజనం పులకించిపోయింది.

Edurukolu festival in Bhadradri
భద్రాద్రి

By

Published : Apr 20, 2021, 10:01 PM IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టాల్లో ఒకటైన ఎదుర్కోలు మహోత్సవం కన్నుల పండువగా సాగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన రాముల వారికి సుగుణాల రాశి సీతమ్మకు జరిగే కల్యాణ మహోత్సవానికి ముందురోజు జరిగే ఎదుర్కోలు వేడుక ఆద్యంతం వైభవోపేతంగా సాగింది.

నిరాడంబరంగా ఎదుర్కోలు...

వేదమంత్రోచ్ఛారణలు, వేద పండితుల ప్రతి సంభాషణల మధ్య వీనుల విందుగా సాగింది. కరోనా ప్రభావంతో ఆలయ పరిసరాల్లో భక్తుల జయజయధ్వానాలు, శ్రీరామ నామస్మరణలు లేనప్పటికీ ఎదుర్కోలు మహోత్సవం వైభవోపేతంగా సాగింది. బేడా మండపంలో ఎదురెదురుగా శ్రీరాములవారు, సీతమ్మ తల్లి ఆశీనులు కాగా వేదపండితులు, అర్చకులు పోటాపోటీగా సీతారాముల వారిని కీర్తించారు.

వధూవరుల వంశ కీర్తి ప్రతిష్ఠల్ని వివరించారు. చూడచక్కని వాడు ప్రపంచానికి ఆనందం పంచేవాడు రామచంద్రుడని రామయ్య తరఫు పురోహితులు కీర్తించగా సుగుణాల రాశి, అయోనిజ సీతమ్మ వల్లే రామయ్యకు కీర్తి ప్రతిష్ఠలంటూ సీతమ్మ తల్లి తరఫు అర్చకులు కీర్తించారు.

కొంతమంది ప్రముఖులు మాత్రమే...

వేద మంత్రోచ్ఛారణలు, వేద పండితుల సంభాషణల మధ్య ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. వధూ వరుల వంశాల విశిష్ఠతను వివరిస్తూ సీతారాముల ఔన్నత్యాన్ని చాటిచెప్పారు. సీతారాముల గుణగణాలను కొనియాడారు. చల్లని సీతమ్మకు చక్కని రామయ్య చక్కని జోడి అని సంభాషించారు.

వీరి జంట కనుల పంట అని కొనియాడారు. ఎదుర్కోలు మహోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు మరికొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. కొవిడ్ ప్రభావంతో వరుసగా రెండోసారి కూడా సీతారాములవారి బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా సాగుతున్నాయి.

ఇదీ చదవండి:రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

ABOUT THE AUTHOR

...view details