తెలంగాణ

telangana

By

Published : Mar 30, 2022, 10:35 AM IST

ETV Bharat / state

కరీంనగర్‌లో వీధివ్యాపారుల కోసం వెండింగ్ జోన్లు

Vending Zones in Karimnagar : కరీంనగర్‌ శరవేగంగా అభివృద్ధి చెందుతుండగా వీధి వ్యాపారుల పరిస్థితి దినదినగండంగా మారింది. రహదారి విస్తరణ అంటూ అధికారుల ఒత్తిళ్లతో వందలాది మంది వీధిన పడే పరిస్థితి నెలకొంది. కరోనా వల్ల వ్యాపారాలు దివాళాతీసిన తరుణంలో చిరువ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏడాదిగా రోడ్డు పక్కన వ్యాపారాలు చేసే పరిస్థితి లేక కనీసం తినడానికి తిండి దొరకని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసి వారిని ఆదుకునేందుకు నగరపాలక సంస్థ చేయూతనిస్తోంది.

Vending Zones in Karimnagar
Vending Zones in Karimnagar

కరీంనగర్‌లో వీధివ్యాపారుల కోసం వెండింగ్ జోన్లు

Vending Zones in Karimnagar : కరీంనగర్‌ను స్మార్ట్‌సిటీగా మార్చేందుకు పక్కా ప్రణాళికలతో నగరపాలకసంస్థ ముందుకెళుతోంది. రోడ్డు ప్రమాదాలకు తోడు రహదారుల విస్తరణలో భాగంగా వీధివ్యాపారులను అధికారులు ఖాళీ చేయించారు. నగరపరిధిలో ఎక్కడ చూసినా అడుగడుగునా పండ్ల దుకాణాలు..చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు,కొబ్బరి బోండా దుకాణాలు కనిపించేవి. ట్రాపిక్ అధికంగా ఉండే ప్రాంతాల్లో వీధి వ్యాపారులను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. రెడ్‌జోన్లు మినహా మిగతాచోట్ల వెండింగ్‌ జోన్లుగా నిర్ణయించారు. ఆ ప్రాంతాల్లో మాత్రమే చిరు దుకాణాలను అనుమతించాలని యంత్రాంగం తీసుకున్న నిర్ణయంతో వీధివ్యాపారులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వెండింగ్‌ జోన్లలో నగరపాలక సంస్థ ప్రత్యేక నిధులతో షట్టర్లు నిర్మించడాన్ని స్వాగతిస్తున్నారు. వ్యాపారాల్లేక బతుకుదెరువు కోల్పొయిన తమకు త్వరగా దుకాణాలు నిర్మించి తమకు అందజేయాలని వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

"30 ఏళ్ల నుంచి రోడ్డు పక్కనే కిరాణా షాపు నడిపించుకున్నం. కరోనా వల్ల మేం చాలా ఇబ్బందులు పడ్డాం. ఏడాది నుంచి రహదారి విస్తరణ వల్ల మరింత అవస్థలు పడుతున్నాం. కార్పొరేటర్, మేయర్ వచ్చి.. మాకు షెటర్లు కట్టిస్తామన్నారు. రోడ్డు విస్తరణకు అడ్డురాకుండా షెటర్లు నిర్మించి ఇస్తామన్నారు. దీని కోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయించారు. ఇగ మాకు మళ్లీ మంచి రోజులు వచ్చినయి. మాకు సాయం చేస్తున్న మేయర్‌కు కృతజ్ఞతలు."

- చిరువ్యాపారులు, కరీంనగర్

Karimnagar Vending Zones : చిరు వ్యాపారుల శ్రేయస్సు, ప్రజాఅవసరాల దృష్ట్యా ఫుట్‌పాత్‌లపై కాకుండా వెండింగ్ జోన్లలో మాత్రమే వ్యాపారాలు కొనసాగేలా చర్యలు చేపట్టారు. ఇప్పటికే బస్టాండ్ వెనక భాగంతో పాటు జైలు వద్ద నిర్మాణాలు పూర్తిచేసి వ్యాపారులకు దుకాణాలను అప్పగించారు. మరిన్ని చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టామని కరీంనగర్‌ మేయర్ సునీల్‌రావు వివరించారు.

"దాదాపు నగరానికి అన్నివైపుల వెండింగ్ జోన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నాం. చిరువ్యాపారులకు చేదోడుగా నిలవాలని నిర్ణయించాం. మరో రెండు మూడు నెలల్లో వారికి షెటర్లు నిర్మించి ఇస్తాం. పోలీసులు, రహదారి విస్తరణ, ఇతర కారణాల వల్ల ఇక చిరువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వారు సమాజంలో గౌరవంగా ఆత్మవిశ్వాసంతో బతకాలనే ఉద్దేశంతోనే ఈ షెటర్లు ఏర్పాటు చేస్తున్నాం."

- సునీల్ రావు, కరీంనగర్ మేయర్

ABOUT THE AUTHOR

...view details