తెలంగాణ

telangana

ETV Bharat / state

హీటెక్కిన హుజూరాబాద్​ రాజకీయాలు.. ఉద్రిక్తంగా పరిస్థితులు - huzurabad news today

tension at huzurabad: సవాళ్లు.. విమర్శలు.. అరెస్టులతో హుజూరాబాద్‌ రణరంగాన్ని తలపించింది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు సవాల్‌ విసిరిన తెరాస ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి.. బహిరంగ చర్చకు రావాలంటూ కార్యకర్తలతో కలిసి పట్టణానికి వచ్చారు. వారిని అడ్డుకునేందుకు భాజపా శ్రేణులు యత్నించటంతో.. ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

హీటెక్కిన హుజూరాబాద్​ రాజకీయాలు.. ఉద్రిక్తంగా పరిస్థితులు
హీటెక్కిన హుజూరాబాద్​ రాజకీయాలు.. ఉద్రిక్తంగా పరిస్థితులు

By

Published : Aug 5, 2022, 1:06 PM IST

tension at huzurabad: కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్‌లో అధికార తెరాస - భాజపా సవాళ్లు - ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయం వేడి రగులుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ ఇరు పార్టీల నేతలు సవాళ్లు విసురుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 10 నెలల క్రితం జరిగిన ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించారు. కాంగ్రెస్​ నుంచి తెరాసలోకి వచ్చిన కౌశిక్​రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రావటంతో.. ఆయన వరుసగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక్కడి నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ భాజపా రాష్ట్ర స్థాయిలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు.

BJP TRS fight in Huzurabad : ఈ క్రమంలోనే గత వారం రోజులుగా తెరాస, భాజపాల మధ్య అభివృద్ధి విషయమై సవాళ్లు-ప్రతి సవాళ్లు రాజుకున్నాయి. తెరాస చేస్తున్న అభివృద్ధే నియోజకవర్గంలో ఉందని.. ఈ విషయమై ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్‌ బహిరంగ చర్చకు రావాలని కౌశిక్​రెడ్డి సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌ అభివృద్ధి అంతా తాను చేసిందేనంటూ ఈటల.. కౌశిక్‌ రెడ్డికి ప్రతి సవాల్‌ విసిరారు. దీంతో ఇరు పార్టీల మధ్య రాజకీయ రగడ మొదలైంది.

ఈ క్రమంలోనే తాను చర్చకు సిద్ధమంటూ ఇవాళ అంబేడ్కర్‌ చౌరస్తాకు రావాలంటూ కౌశిక్‌రెడ్డి భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఉదయం తెరాస శ్రేణులతో కలిసి అంబేడ్కర్‌ చౌరస్తాకు కౌశిక్‌రెడ్డి చేరుకోవటంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్పటికే భారీగా పోలీసులు మోహరించి.. అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్‌రెడ్డి చౌరస్తాలో మాట్లాడుతున్న సమయంలో మరోవైపు నుంచి తరలివచ్చిన భాజపా శ్రేణులు.. కౌశిక్‌రెడ్డిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో తెరాస-భాజపా శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. రోడ్డుపై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

ఇవీ చూడండి..Revanth Reddy : 'నా మాటలకు వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు'

కల్తీ మద్యానికి 8 మంది బలి.. చూపు కోల్పోయిన 25 మంది

ABOUT THE AUTHOR

...view details