శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి కలకలం Bear at Satavahana University : కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టిస్తోంది. గర్ల్స్ హాస్టల్ గేటు ముందు నుంచి వెళ్తున్న ఎలుగుబంటిని ఓ విద్యార్థిని గుర్తించి సెల్ఫోన్లో వీడియో తీసింది. ఈ విషయంపై యూనివర్సిటీ అధికారులు.. అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వర్సిటీకి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఎలుగుబంటి కోసం జల్లెడ పడుతున్నారు. విశ్వవిద్యాలయంలోని చిట్టడవిలో రెండు నీటి కుంటలున్నాయి. అక్కడికి ఎలుగుబంటి నీటి కోసం వస్తుందని అంచనా వేశారు. ఇంకా ఏఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందో గుర్తించి కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు.
కుక్కలు తరిమికొట్టాయి
"ఒకరోజు ఉదయం కుక్కలు బాగా అరవడం విన్నాం. ఏమైందోనని చూస్తే అక్కడ ఎలుగుబంటి కనిపించింది. దాన్ని గేటు లోపలికి రాకుండా కుక్కలు అడ్డుకుంటున్నాయి. ఎలుగుబంటిని హాస్టల్లోకి రాకుండా గుట్టులు, కుంటలు ఉన్న వైపు తరిమికొట్టాయి. వెంటనే మేం మా యాజమాన్యానికి చెప్పి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాం."
- దేవరాజం, సెక్యూరిటీ గార్డు
అల్లాడుతున్న జంతువులు..
Bear in Satavahana University : గతంలో కరీంనగర్ చుట్టుపక్కల విస్తారమైన అడవులు, భారీ గుట్టలు ఉండేవి. భూముల ధరలు పెరగడం, నగరం అభివృద్ధి చెందుతుండటంతో కొండలు, గుట్టలతోపాటు చెట్లు మాయం అవుతున్నాయి. అడవుల్లో సంచరించే జంతువులు ఆహారం, నీటి కోసం అల్లాడుతున్నాయి. జనావాసాల్లోకి వస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
"ఎలుగుబంటి ఆనవాళ్లను డ్రోన్లతో కూడా పరిశీలించాం. కానీ అది ఎక్కడా కనిపించలేదు. మా రెస్క్యూ టీమ్ను కూడా పంపించాం. కాని కనిపెట్టలేకపోయారు. అది సంచరించే ప్రాంతాల్లో బోన్లు, కెమెరాలు పెట్టాం."
- బాలమణి, ఫారెస్ట్ కన్జర్వేటర్
బయటకు రావొద్దు..
Bear Wanders in Satavahana University : ఇంతకుముందు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎలుగుబంటి దూరడంతో భయాందోళనకు గురయ్యారు. శాతవాహన యూనివర్సిటీ ఒకప్పుడు అడవిలాగానే ఉండేది. 200 ఎకరాల్లో వర్సిటీని ప్రారంభించడంతో.. భూములను పూర్తిస్థాయిలో కాపాడుకోవడానికి ప్రహరీ గోడతోపాటు పలు భవనాలు నిర్మించారు. ప్రస్తుతం గర్ల్స్ హాస్టల్లో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఈ సంఘటన తర్వాత వర్సిటీకి సోమ, మంగళవారం సెలవులు ప్రకటించి విద్యార్ధులు బయటికి రాకుండా ఆంక్షలు విధించినట్లు వీసీ మల్లేశం తెలిపారు.
"వర్సిటీలో ఉన్న విద్యార్థులను అలెర్ట్ చేశాం. మా సిబ్బందిని కూడా అప్రమత్తం చేశాం. విద్యార్థులను హాస్టళ్లకే పరిమితం చేశాం. కళాశాలకు సెలవులు ప్రకటించాం. ఎలుగుబంటిని కనిపెట్టడానికి అటవీ అధికారులు శ్రమిస్తున్నారు. అది దొరికిన తర్వాతే తరగతులు ప్రారంభిస్తాం. లేకపోతే సెలవులను పొడిగిస్తాం. విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యత."
- మల్లేశం, శాతవాహన వర్సిటీ ఉపకులపతి
ప్రస్తుతం సెలవులు ప్రకటించి ఎలుగుబంటి కోసం వెతుకుతున్న అధికారులు... పరిస్థితిని బట్టి సెలవులు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.