తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2020, 11:54 AM IST

ETV Bharat / state

మాయదారి పరీక్ష.. సామాన్యులకు శిక్ష..

చిన్నపాటి లోపాలు ప్రభుత్వం నుంచి అందే వైద్యానికి శాపాలుగా మారుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు సమకూరుస్తున్నా చిన్నపాటి మరమ్మతులు చేయలేక విలువైన యంత్రాలు మూలకు చేరుతున్నాయి. దీంతో తప్పనిసరై ప్రైవేటు బాటను పట్టాల్సిన పరిస్థితి పేద ప్రజలకు ఏర్పడుతోంది.

Private hospitals are robbed in the name of health tests in karimnagar district
మాయదారి పరీక్ష.. సామాన్యులకు శిక్ష..

  • రామడుగు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ సాధారణ జ్వరమని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడున్న వైద్యులు విధిగా సీటీ స్కాన్‌ చేసుకుని రావాల్సిందేనని చెప్పడంతో అప్పుచేసి రు.6500 తో మరుసటి రోజు సీటీ స్కాన్‌ చేయించుకుంది. తీరా నిర్ధారణలో ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యుడు వారం రోజులకు మాత్రలు వాడాలని సలహా ఇచ్చాడు.
  • చిగురుమామడి మండలంలోని ఓ వ్యక్తి కడుపులో మంటగా ఉందంటూ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పతికి వచ్చి వైద్యుడిని సంప్రదించాడు. ముందుగా సీటీ స్కాన్‌ చేయించాలని సూచించడంతో రూ.6500 పెట్టి చేయించాడు. అందులోనూ ఏ సమస్య లేదని తేలటంతో ఒక రోజంతా ఆస్పత్రిలో ఉంచుకుని ఇంటికి పంపించారు. హడావుడి చేసి రూ. 20వేల వరకు బిల్లు వేశారు. ఇలా ఈ ఒక్కరే కాదు ప్రతి నిత్యం ఆస్పత్రికి వచ్చిన అందరికి సీటీ స్కాన్‌ను అనివార్యంగా మార్చేశారు.

కరోనా ప్రభావం కనిపిస్తున్న ప్రస్తుత తరుణంలో అత్యవసర వైద్యమే ఆసరాగా ప్రైవేటులో ఇష్టారాజ్యమనే వ్యవహారం కనిపిస్తోంది. ఉన్నదానికి లేనిదానికి పలురకాల పరీక్షల్ని చేపట్టడం.. అవసరమున్నా లేకున్న అనివార్యమనేలా జేబుల్ని గుల్లచేసే తంతు జిల్లాలోని కొన్ని ప్రైవేటు దవాఖానాల్లో దర్శనమిస్తోంది. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చే పేద రోగులకు ఊహించని ఆర్థిక భారమనేది ప్రాణసంకటంగానే మారుతోంది.

వాటాల పర్వమనే తీరు..!

జిల్లాకేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగికి ముందుగా కరోనా నిర్ధారణలో భాగంగా సీటీ స్కాన్‌ను చేయిస్తున్నారు. రోగుల నుంచి ముప్పు వాటిల్లకుండా ఉండటంతోపాటు పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ అని నిర్ధారించుకునేందుకు ఇలా చేస్తున్న తీరులో ఊహించని దోపిడీ జరుగుతోంది. ఒకప్పుడు ఒక్కో ల్యాబ్‌లో గరిష్ఠంగా 10-15 స్కాన్‌లు జరగడమే గగనం. అలాంటిది ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ల్యాబ్‌లో 25-30 మందికి రేయింబవళ్లు ఈ తరహా పరీక్షల్ని కచ్చితంగా జరిపిస్తున్నారు. ఒక్కో స్కానింగ్‌కు రూ.6500- 7వేల వరకు వసూలు చేస్తున్నారు. రోజువారీగా చేస్తున్న వీటి వల్ల రోగికి అవసరం లేని సందర్భాలే అధికంగా ఉంటున్నాయనేది ఆస్పత్రి వర్గాల నుంచే వినిపిస్తున్న మాట. మరోవైపు ఏ ప్రైవేటు ఆస్పత్రి నుంచి రోగిని పంపిస్తారో.. వాళ్లకి ల్యాబ్‌ నిర్వాహకులకు 50శాతం చొప్పున ఇందులో వాటాగా వెళ్తుండటంతో కనిపించకుండా ఈ దందా జోరుగానే సాగుతోంది. కొన్ని చోట్ల బాహాటంగానే వాటాల పర్వంపై దర్జాగా పెదవి విప్పుతున్నారు. రోగుల విషమ పరిస్థితిని, అనారోగ్యకర ఇబ్బందిని సొమ్ము చేసుకుంటున్న తీరుపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లపై పర్యవేక్షణను పెంచాల్సిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం ఇదంతా తమకేమి పట్టదనేలా వ్యవహరిస్తున్నారు.

ఇదీ ప్రభుత్వాసుపత్రిలో సీటీ స్కాన్‌ యంత్రం ఉన్న గది. ఇది గడిచిన కొన్నేళ్లుగా పనిచేయకపోవడంతో మూలన పడేశారు. గదికి తాళం వేశారు. రోడ్డు ప్రమాదాలతో అత్యవసర సేవలతో రోగులెవరూ జిల్లాసుపత్రిని చేరినా.. సీటీ స్కాన్‌ కోసం ప్రైవేటు ల్యాబ్‌ గడప తొక్కాల్సిందే.! ఆపదవేళ ఇక్కడి వచ్చే నిరుపేదలకు ఉన్నపళంగా వేల రూపాయల్ని పెట్టాల్సి రావడం కష్టమైన ఇబ్బందే.! ఇలా నిత్యం 20-25 మంది ఇలా ప్రైవేట్‌ బాట పట్టాల్సిన పరిస్థితి జిల్లా కేంద్రంలో ఏర్పడుతోంది. ఐదారు లక్షల రూపాయలు వెచ్చిస్తే ఇది వినియోగంలోకి రానుంది. కానీ ఈ విషయాన్ని ఆలాపనగా వింటున్నారే.. తప్పా ఎవరు పట్టించుకున్న పాపాన పోవడంలేదు.

అధికారులేమన్నారంటే..!

జిల్లాసుపత్రిలో ఉన్న సీటీ స్కాన్‌ యంత్రాన్ని మరమ్మతు చేయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని.. ప్రస్తుతం దీని సేవలు లేకపోవడంతో ఇబ్బంది నెలకొందని జిల్లాసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య అన్నారు. ఇక జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌ల తీరుపైన దృష్టి పెడుతామని సేవలు ఎలాంటి లోపాలు లేకుండా అన్నివర్గాల ప్రజలకు అందేలా చూస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు.

ఇవీ చూడండి:ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు: కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details