తెలంగాణ

telangana

ETV Bharat / state

నత్తనడకన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు - రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో జాప్యం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లు స్థల కొరతతో ప్రారంభాలకు నోచుకోవడం లేదు. కొన్ని చోట్ల పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

నత్తనడకన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు
నత్తనడకన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు

By

Published : Jul 30, 2020, 10:23 AM IST

సొంత ఇళ్లు కట్టుకోవాలనేది ప్రతి పేదవాడి స్వప్నం. దానికోసం పైసాపైసా కూడబెడుతుంటారు. అలాంటి నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి గృహాలను కట్టించి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రతి గ్రామంలో అర్హుల జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించింది.

ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారులు ఇంటింటికీ తిరిగి జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. తమతమ గ్రామాలలో నిర్మాణాల కోసం ప్రజా ప్రతినిధులు ఆరాటపడినా స్థల కొరత ఉండడం, స్థలం ఉన్న గ్రామాలలో ఇళ్లు సముదాయంగా వద్దని తమకు ఇళ్ల స్థలాలు ఉన్న చోటనే కట్టించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. దీంతో ఆయా నిర్మాణ పనులలో అడుగు ముందుకు పడటం లేదు.

కరీంనగర్‌ జిల్లాలో ఇటీవల ఏర్పడ్డ నూతన గ్రామపంచాయతీలతో కలిపి తిమ్మాపూర్‌ మండలంలో 23 గ్రామ పంచాయతీలున్నాయి. మొదటి దశలో పర్లపల్లి, పోలంపల్లి, తిమ్మాపూర్‌, రామకృష్ణకాలనీ, చేపలకాలనీలో మొత్తం 120 మంజూరు కాగా 89 మాత్రమే ప్రారంభమయ్యాయి. వీటిలో తిమ్మాపూర్‌లో మాత్రమే నిర్మాణాలు పూర్తిదశకు చేరుకోగా పోలంపల్లి, రామకృష్ణకాలనీ, చేపల కాలనీలో పనులు నత్తనడకన సాగుతూనే ఉన్నాయి.

తిరిగి రెండో దశలో దాదాపు అన్ని గ్రామాలకు కలిపి 290 ఇళ్లు మంజూరు కాగా, 48 మాత్రమే ప్రారంభమయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయినా...

తిమ్మాపూర్‌ మండలంలోని పోలంపల్లి, పర్లపల్లి గ్రామాలలో మూడు సంవత్సరాల క్రితం రోడ్డు విస్తరణలో భాగంగా పోలంపల్లిలో 10, పర్లపల్లిలో 20 ఇళ్ల నిర్మాణాలను రోడ్లు, భవనాల శాఖ అధికారులు కూల్చివేశారు. రెండు గ్రామాలలో ఇళ్లు నిర్మించి వీరికే మొదట ఇవ్వాలని నిర్ణయించారు. పోలంపల్లిలో పనులను వెంటనే ప్రారంభించినా, పిల్లర్ల దశలోనే వదిలేశారు. దీంతో విసుగు చెందిన బాధితులు తమ సొంత డబ్బుతోనే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పర్లపల్లి గ్రామానికి మొదటి దశలో 10, రెండో దశలో 10 ఇళ్లు మంజూరైనా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు.

పనులను పర్యవేక్షిస్తున్నాం

మండలంలో ఎంపిక చేసిన గ్రామాలలో పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణాలు మంజూరైన మిగతా గ్రామాలలో సైతం త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నాం. కొన్ని గ్రామాలలో ఎదురవుతున్న చిన్నచిన్న సమస్యలను అధిగమించి త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లను అందించేలా చూస్తాం.

-రాజశేఖర్‌, ఏఈ, ఆర్‌అండ్‌బీ

ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details