తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర ‘పాలన’ మరింత సౌలభ్యం.. త్వరలోనే వార్డుకో అధికారి!

పుర, నగరపాలికల్లో ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండేలా వార్డు, డివిజన్‌కు ఒక అధికారిని నియమించేందుకు పురపాలిక కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని నాలుగు రోజుల కిందట ఆ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. దీంతో పాటు ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు నిర్ణయించడం వల్ల పాలనా వ్యవహారాలు మరింత మెరుగు పడనున్నాయి.

By

Published : Aug 24, 2020, 9:47 AM IST

పుర ‘పాలన’ మరింత సౌలభ్యం.. త్వరలోనే వార్డుకో అధికారి!
పుర ‘పాలన’ మరింత సౌలభ్యం.. త్వరలోనే వార్డుకో అధికారి!

కరీంనగర్‌ జిల్లాలోని కరీంనగర్‌ నగరపాలికతో పాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏడు నెలల కిందటే కొత్త పాలకవర్గాలు కొలువు దీరిన విషయం తెలిసిందే. ఇంకేముంది ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వైపు చర్యలు చేపట్టారు. ఫిబ్రవరిలో పట్టణాల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికోసం వార్డు కమిటీలు కూడా ఖరారు చేశారు. ఐదేళ్ల అభివృద్ధిపై 10రోజుల పాటు జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రణాళికలు కూడా చేశారు.

ఇప్పటికే వార్డు కమిటీలు

ప్రజల భాగస్వామ్యం పెంచేందుకు ప్రభుత్వం వార్డు, డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ, పుర, నగరపాలక అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనేలా వీరికి అవకాశం కల్పించారు. డివిజన్లు, వార్డుల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కలిసి హరితహారం, పారిశుద్ధ్య పనులు, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి భాగస్వామ్యం చేశారు. వార్డు, డివిజన్‌లో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయగా, అందులో యూత్‌, మహిళా, విశ్రాంత ఉద్యోగులు, పర్సనాలిటీ కమిటీలు ఎంపిక చేశారు. ఒక్కొక్క కమిటీలో 15మంది చొప్పున ఒక వార్డుకు మొత్తం 60మంది సభ్యులున్నారు.

వార్డుకో పురపాలక అధికారి

వార్డులు, డివిజన్‌లలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడూ తెలుసుకునేందుకు వార్డుకో పురపాలక అధికారిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పారిశుద్ధ్యం, హరితహారం, పౌరసేవలు, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీలకు వెళ్లకుండానే, అధికారులు దొరకడం లేదనే ఇబ్బందులు లేకుండా డివిజన్లు, వార్డుల్లోని అధికారుల దగ్గరికి వెళ్లి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది.

కొత్త నియామకమా.. సర్దుబాటనేనా?

వార్డుకో అధికారి నియమించాలంటే జిల్లాలో ప్రత్యేకంగా 146 మందిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కరీంనగర్‌ నగరపాలకలోనే వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త మున్సిపాలిటీల్లో అయితే పోస్టుల భర్తీ జరగలేదు. ఒప్పంద ఉద్యోగులతోనే పనులు చేయిస్తున్నారు. ప్రస్తుతం వార్డుల వారీగా ఏఈలు పని చేస్తున్నారు. వారినే సర్దుబాటు చేస్తారా అనేదీ తెలియకుండా మారింది.

వార్డులోనే కార్యాలయం?

పారదర్శక పాలన అందించడం కోసం ఏ వార్డుకు ఆ వార్డులోనే కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన విధివిధానాలు ఇంకా ప్రకటించలేదు. జీహెచ్‌ఎంసీలో మాత్రం సర్కిల్‌ కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఏ సర్కిల్‌ పరిధిలోని ప్రజలు ఆయా సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లి తమ సమస్యలను, పనులను పూర్తి చేసుకుంటున్నారు. అయితే కరీంనగర్‌లో ప్రస్తుతం విలీన కాలనీల్లో ఉన్న పంచాయతీ భవనాలను డివిజన్‌ కార్యాలయాలుగా మార్చాలనే ప్రతిపాదనలు చేశారు. అక్కడే ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించాలని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం వార్డుకో అధికారి ప్రకటన చేసింది.

ఇదీ చదవండి:భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం

ABOUT THE AUTHOR

...view details