తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2020, 10:21 AM IST

Updated : Jul 10, 2020, 11:10 AM IST

ETV Bharat / state

దసరాలోగా రైతు కల్లాల నిర్మాణం పూర్తి: మంత్రి గంగుల

కరీంనగర్​ కార్పొరేషన్​ పరిధిలోని హరితహారం కార్యక్రమానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు వెదురుగట్ట అడవికి 'కేసీఆర్ వనం'గా నామకరణం చేశారు. దసరా నాటికి రైతు కల్లాల నిర్మాణాలు పూర్తికావాలని అధికారులను ఆదేశించారు.

minister gangula kamalakar review with officials in karimnagar
దసరాలోగా రైతు కల్లాల నిర్మాణం పూర్తి:గంగుల కమలాకర్

ముఖ్యమంత్రి కేసీఆర్​కు నీళ్లతో పాటు చెట్లంటే ఎంతో ఇష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్​ కలెక్టరేట్​లో హరితహారం, రైతు వేదికలు, కల్లాల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కరీంనగర్​ కార్పొరేషన్​ పరిధిలోని నాలుగు మున్సిపాలిటీల్లో హరితహారంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అందమైన పూలమొక్కలు నాటాలని సూచించారు. నగరంలోని 14.5 కిలోమీటర్ల ప్రధాన రహదారులతో పాటు, జిల్లా సరిహద్దుల వరకు ఉన్న రోడ్లకు ఇరువైపులా రెండుమూడు వరుసల్లో మొక్కలు నాటాలని సూచించారు.

డీఎంఎఫ్​టీ నిధుల నుంచి హరితహారం కార్యక్రమానికి కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. కరీంనగర్ నగర పాలక సంస్థకు రూ.50 లక్షలు, చొప్పదండి మున్సిపాలిటీ రూ.30 లక్షలు, కొత్తపల్లి మున్సిపాలిటీకి రూ.20 లక్షలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

కేసీఆర్ వనం..

చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచన మేరకు వెదురుగట్ట అడవికి 'కేసీఆర్ వనం'గా నామకరణం చేసి తీర్మానం చేశారు. హరితహారంలో భాగంగా వెదురుగట్టులో అధికసంఖ్యలో మొక్కలు నాటారని రవిశంకర్​ను మంత్రి అభినందించారు. కురిక్యాల గ్రామంలోని బొమ్మలగుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

దసరా నాటికి రైతు కల్లాలు..

రైతు కల్లాల నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం రూ.750 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 2,318 మంది రైతులు కల్లాలు నిర్మించేందుకు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు. వాటి నిర్మాణానికి రూ. 22కోట్లు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. దసరా నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒక్కో కల్లం నిర్మాణానికి 50 చదరపు మీటర్లకు రూ.56 వేలు, 60 చదరపు మీటర్లకు రూ.68 వేలు, 75 చదరపు మీటర్లకు రూ.85వేలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. బీసీ, జనరల్‌ కేటగిరీ రైతులు 10 శాతం డబ్బులు వాటాగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తి ఉచితంగా కల్లాలు నిర్మిస్తామన్నారు.

ఈ సమీక్షలో కలెక్టర్​ శశాంక, మున్సిపల్ కమిషనర్​ క్రాంతి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీష్ బాబు, నగర మేయర్ సునీల్​రావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవీచూడండి:'మహిళల అవస్థ గుర్తించాం.. ఆగస్టు 14లోపు నిర్మాణాలు పూర్తిచేస్తాం'

Last Updated : Jul 10, 2020, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details