తెలంగాణ

telangana

Millers Frauds Telangana : ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ ఇవ్వకుండా.. మిల్లర్ల తాత్సారం

By

Published : Jul 13, 2023, 2:26 PM IST

Millers Frauds in Telangana : ప్రతి సీజన్‌లో ధాన్యం రైస్‌ మిల్లులకు కేటాయిస్తున్నా.. బియ్యం మాత్రం తిరిగి పౌరసరఫరాల శాఖకు చేరడం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించాల్సి ఉన్నా.. అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఒక సీజన్‌లో కేటాయించిన ధాన్యానికి సంబంధించిన బియ్యం ఇచ్చిన తర్వాతే.. మరో సీజన్‌లో కేటాయించాల్సి ఉంటుంది. కానీ.. రైస్‌మిల్లులకు కేటాయించిన ధాన్యం తిరిగి ఇవ్వకపోయినా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయంగా మారింది.

Etv Bharat
Etv Bharat

ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ ఇవ్వకుండా.. రైస్‌మిల్లర్ల తాత్సారం

Millers Frauds in Telangana : రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రైస్‌మిల్లులు.. ప్రభుత్వానికి కస్టమ్‌ మిల్డ్‌ రైస్‌ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. కూలీల కొరత ఇతరత్రా కారణాలు చెబుతూ ఏ నెలకానెల బియ్యం ఇవ్వకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఒక సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి బియ్యం ఎఫ్‌సీఐ లేదా రాష్ట్రపౌరసరఫరాల శాఖకు ఇవ్యాల్సి ఉంటుంది. కానీ బియ్యం తిరిగి ఇవ్వకపోవడంతో జిల్లా కలెక్టర్లు మొక్కుబడిగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి ఒక గడువు విధిస్తూ వస్తున్నారు. అయితే రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు అవాంతరాలు ఏర్పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వంరైస్‌మిల్లర్ల వ్యవహారాన్ని చూసీచూడనట్లుగా వ్యవహరించింది. తాజాగా రైస్‌మిల్లర్లపై ఆధారపడకుండా ప్రభుత్వమే ఫుడ్‌ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ క్రమంలో సర్కార్‌ కు రావాల్సిన సీఎంఆర్‌ ఇవ్వని రైస్‌మిల్లుల్లో ధాన్యం ఉన్నాయా లేదా తనిఖీలకు శ్రీకారం చుట్టింది.

Millers Frauds in FCI Rice : పౌరసరఫరాల శాఖమంత్రి గంగుల కమలాకర్ సొంత జిల్లాలో పౌరసరఫరాలశాఖ ఛైర్మన్ రవీందర్‌సింగ్‌ తనిఖీలు చేపట్టారు. సీఎంఆర్‌ ఇవ్వకుండా ధాన్యం పక్కదారి పట్టించారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని పలు మిల్లులపై దాడులు నిర్వహించారు. 2 బృందాలుగా ఏర్పడిన అధికారులు 4 మిల్లులను తనిఖీ చేశారు. ముందుగా మహాలక్ష్మి రైస్‌ మిల్లును తనిఖీ చేయగా సీఎంఆర్‌ కింద కేటాయించిన 82 లక్షల విలువ చేసే సుమారు 4వేల క్వింటాళ్లు 10వేల బస్తాలు ధాన్యం తక్కువగా ఉండటాన్ని గుర్తించారు.

ఆ తర్వాత వరుణ్‌ ఇండస్ట్రీస్‌ను తనిఖీ చేయగా సీఎంఆర్‌ కింద కేటాయించిన ధాన్యం నిల్వలు అసలే కనిపించకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. యజమాని శీలాశ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే వేరే గోదాములో ఉన్నాయని.., తనకు అనార్యోగంగా ఉందంటూ ఆస్పత్రిలో చేరడంతో బియ్యం లేనట్లు అధికారులు నిర్ధారించి, తనిఖీలు చేయకుండా మిల్లును సీజ్‌ చేశారు. సీఎంఆర్‌ ధాన్యం లెక్కల్లో తేడాలున్న ఈ రెండు మిల్లులు శీలాశ్రీనివాస్‌వే. లక్ష్మీగణపతి రైస్‌మిల్లుకు కేటాయించిన సీఎంఆర్‌ ధాన్యంలో 3వేల 817 బస్తాలు తక్కువగా ఉన్నాయి. సీఎంఆర్‌ కింద ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు మిల్లుల్లో లేకపోతే సంబంధిత మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంస్థ ఛైర్మన్‌ రవీందర్‌సింగ్‌ తెలిపారు.

"ప్రభుత్వానికి మా ధాన్యాన్ని పంపిస్తున్నారా లేదా గోదాముల్లో మా ధాన్యం ఉందా లేదా అన్నది తనిఖీలు చేస్తున్నాము. మా ధాన్యం ఏ వ్యక్తి దగ్గరైతే ఉండదో వారు ఎంత పెద్ద వారైనా వారిపై చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా మా బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి." - రవీందర్ సింగ్‌, పౌరసరఫరాల సంస్థ ఛైర్మెన్‌

రైస్ మిల్లుల్లో ధాన్యం ఉన్నాయా.. బియ్యం సిద్ధంగా ఉందా.. లేదా.. అనే విషయాన్ని తనిఖీ చేయడానికి వచ్చిన అధికారులకు రైస్‌మిల్లుల్లో రేషన్ షాపు బియ్యం కనిపించాయి. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి బియ్యం ఇవ్వాల్సి ఉండగా.. రైస్‌మిల్లర్లు ధాన్యం పక్కదారి పట్టించి ఇతరులకు అమ్ముకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యం రీసైకిలింగ్ చేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న500 బస్తాలు తనిఖీల్లో బయటపడింది. అయితే ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లర్లు మర ఆడించారా లేదా అనే విషయాన్ని తేల్చేందుకు విద్యుత్‌ బిల్లులు ఏ మేరకు చెల్లించారనే విషయాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ బియ్యం ఇవ్వని రైస్‌మిల్లర్లపై చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.

"లక్ష్మీ గణపతి రైస్‌ మిల్లులో బియ్యం బస్తాల కొరత కనిపించింది. దాదాపు 500బస్తాల బియ్యం పౌరసరఫరా బియ్యంలా కనిపించాయి. వాటి సాంపుల్స్‌ తీసుకోవడం జరిగింది."- ప్రభాకర్‌, పౌరసరఫరాల శాఖ ఓఎస్డీ

రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌మిల్లలకు కేటాయించిన ధాన్యానికి ఏ మేరకు బియ్యం ఇచ్చారు.... నిల్వలు గోదాముల్లో ఏమేరకు ఉన్నాయనే అంశంపై తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు అధికారులు వెల్లడించడంతో రైస్‌మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details